- రైలు బోగీల్లో హారతులు వద్దు..
- అయ్యప్ప మాలధారులకు దక్షిణ మధ్య రైల్వే విజ్ఞప్తి
హైదరాబాద్ సిటీ: రైళ్లలో పూజలు నిర్వహించవద్దని దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) అయ్యప్ప భక్తులకు కీలక సూచనలు చేసింది. కోచ్లలో కర్పూరం వెలిగించడం, హారతి ఇవ్వడం లాంటివి చేస్తే రైల్వేయాక్ట్లోని 67, 154, 164, 165 సెక్షన్ల ప్రకారం నేరంగా పరిగణించి మూడేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధిస్తామని హెచ్చరించింది. శబరిమల(Sabarimala)కు వెళుతున్న యాత్రికులు రైలు బోగీల లోపల చేస్తున్న పూజల్లో భాగంగా కర్పూరం వెలిగించి హారతులు ఇవ్వడం, అగరబత్తీలు, సాంబ్రాణి పుల్లలు వెలిగిస్తున్నట్లుగా తమ దృష్టికి వచ్చిందని అధికారులు పేర్కొన్నారు. రైళ్లలోకి, రైల్వే ప్రాంగణాల్లోకి మండే స్వభావం ఉన్న పదార్థాలను తీసుకెళ్లడం, వాటిని వెలిగించడం నిషేధమని స్పష్టం చేశారు. ఈ తరహా చర్యలతో అగ్ని ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని, ప్రాణహానితోపాటు రైల్వే ఆస్తులకు తీరని నష్టం కలిగించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఉల్లంఘనలకు పాల్పడితే భారీ జరిమానాతోపాటు మూడేళ్ల వరకు జైలుశిక్ష తప్పదని హెచ్చరించారు. ఇటువంటి పద్ధతులను నివారించే నిమిత్తం దక్షిణ మధ్య రైల్వే పోలీసులు, కమర్షియల్ డిపార్ట్మెంట్ సిబ్బంది విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారని తెలిపారు. సురక్షితమైన ప్రయాణాన్ని అందించేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని కోరా రు. కాగా, దక్షిణ మధ్య రైల్వే పరిధిలో శబరిమల(Sabarimala) యాత్రికుల సౌకర్యార్థం సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ, కాకినాడ, తిరుపతి, నాందేడ్(Secunderabad, Hyderabad, Kacheguda, Kakinada, Tirupati, Nanded) తదితర స్టేషన్ల నుంచి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
Tags
News@jcl