..
ఎస్ఎల్బీసీ సొరంగ ప్రమాదంలో గల్లంతైన కార్మికుల కోసం 16 రోజుల రెస్క్యూ ఆపరేషన్ తర్వాత కీలక పురోగతి కనిపించింది. సొరంగం చివర బురదలో మానవ అవశేషాలు కనిపించాయి. కేరళ కెడావర్ డాగ్స్ గుర్తించిన ప్రాంతాల్లో తవ్వకాలు జరుగుతున్నాయి. మినీ జేసీబీలు, కన్వేయర్ బెల్ట్ సహాయంతో శిథిలాలను తొలగిస్తున్నారు. TBM మిషన్ శకలాల తొలగింపు వేగంగా జరుగుతోంది.
ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో గల్లంతైన కార్మికుల ఆచూకీ కోసం జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్లో కీలక పురోగతి కనిపించింది. రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభమై నేటికి 16 రోజులు పూర్తి అయిన విషయం తెలిసిందే. ఈ రోజు(ఆదివారం) టన్నెల్లోని ఎండ్ పాయింట్ వద్ద బురదలో మనుషుల ఆనవాళ్లు లభిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి మనిషి చర్మాన్ని రెస్క్యూ టీమ్ గుర్తించినట్లు తెలుస్తోంది. మరింత లోతుకు తవ్వితే మరింత ఆచూకీ లభించే అవకాశం ఉంది. తవ్వకాలు జరిగే ప్రాంతాన్ని టన్నెల్ ఎండ్పాయింట్లో కేరళ కెడావర్ డాగ్స్ గుర్తించిన విషయం తెలిసిందే. దాంతో.. ఆయా ప్రదేశాల్లో ర్యాట్ హోల్ మైనర్లు తవ్వకాలు చేపట్టారు. ఈ తవ్వకాలు పూర్తికావస్తుండడంతో కార్మికుల ఆనవాళ్లు లభ్యమైనట్లు తెలుస్తోంది. టన్నెల్లో మినీ జేసీబీలతో శిథిలాలు తొలగిస్తున్నారు. కన్వేయర్ బెల్ట్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చింది. టన్నెల్ ఎండ్ పాయింట్ సమీపంలో TBM మిషన్ ముందు భాగం పూర్తిగా బురదలో కూరుకుపోయింది. TBM మిషన్ వెనుకభాగం శకలాల తొలగింపు వేగంగా సాగుతుంది. రెండు మినీ ప్రొక్లెయిన్స్ ఉపయోగించి TBM శకలాలు తొలగిస్తున్నారు రెస్క్యూ టీమ్.