భారీ వర్షం
మహబూబ్నగర్ జిల్లాలో శనివారం భారీ వర్షం కురిసింది. జడ్చర్ల, భూత్పూర్లలో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లన్నీ నీటితో నిండటంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. జడ్చర్లలో పలు ఇళ్లలోకి నీరు చేరింది. భూత్పూర్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి.
భూత్పూర్, జడ్చర్లలో రోడ్లన్నీ జలమయం
వాహనాల రాకపోకలకు ఇబ్బందులు
జడ్చర్లలో ఇళ్లలోకి చేరి నీరు
కూలిన మార్కెట్ యార్డు గోడ
భూత్పూర్లో విరిగిన విద్యుత్ స్తంభాలు, చెట్లు
పలు చోట్ల దెబ్బతిన్న వరి పంట..
కల్లాల్లో తడిసిన ధాన్యం
: మహబూబ్నగర్ జిల్లాలో శనివారం భారీ వర్షం కురిసింది. జడ్చర్ల, భూత్పూర్లలో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లన్నీ నీటితో నిండటంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. జడ్చర్లలో పలు ఇళ్లలోకి నీరు చేరింది. భూత్పూర్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. వరి పంట నేల వాలింది. నాగర్కర్నూల్, జోగుళాంబ గద్వాల జిల్లాల్లోనూ మోసర్తు వాన పడింది.
జడ్చర్ల అతలాకుతలం
జడ్చర్ల నియోజకవర్గంలోని జడ్చర్ల, మిడ్జిల్లలో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. జడ్చర్ల పట్టణంలోని నల్లకుంట అలుగుపారి నాగర్కర్నూల్కు వెళ్లే రోడ్డుపైకి నీళ్లు చేరాయి. దాంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. వెంకటేశ్వర కాలనీ, సాయినగర్ కాలనీ, కావేరమ్మపేటతో పాటు నాలుగు, 11వ వార్డులలోని ఇళ్లల్లోకి నీరు చేరింది. వర్షం ఉధృతికి వ్యవసాయ మార్కెట్యార్డు గోడ ఒక పక్క కూలిపోయింది. నాలాలను సక్రమంగా శుభ్రం చేయకపోవడంతో పాటు, పలుచోట్ల నాలాలపై నిర్మాణాలు చేపట్టడంతో వర్షం పడిన ప్రతీ సారి ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. నిర్మాణంలో ఉన్న 167వ జాతీయ రహదారిపై నీళ్లు చేరడంతో ద్విచక్ర వాహనాలు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. జడ్చర్ల పట్ణణంలోని 36.5 మిల్లీ మీటర్ల వర్షం కురవగా, మిడ్జిల్ మండలంలోని 20.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. పలుచోట్ల ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు, రైతు సంఘాల నాయకులు కోరుతున్నారు. జడ్చర్ల పట్టణంలో వర్షం కురిసిందంటే లోతట్టు ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన దుస్థితి నెలకొందని, అధికారులు ఇకనైనా స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
నీట మునిగిన రోడ్లు
భూత్పూర్ మండలంలో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. గాలితో కూడిన వర్షం పడటంతో చాలా గ్రామాల్లో చెట్లు, విద్యుత్ స్థంభాలు నేలకూలాయి. వరి, కూరగాయల పంటలకు అక్కడక్కడ నష్టం వాటిల్లింది. భూత్పూర్ చౌరస్తాలో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. మండలంలో సుమారు 12.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. భూత్పూర్ చౌరస్తాలో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతంలో ఉండేవారు జాగ్రత్తగా ఉండాలని, ఆయా వార్డుల్లో నిరంతరం పనిచేయడానికి ప్రత్యేక వార్డు అధికారులను నియమిస్తున్నట్లు కమిషనర్ సురేందర్రెడ్డి తెలిపారు. ఏవైన ఇబ్బందులు ఉంటే వెంటనే మునిసిపల్ హెల్ప్లైన్ టోల్ఫ్రీ నంబర్ 9701652655కు సమాచారం ఇవ్వాలని సూచించారు.
దుక్కులు దున్నడానికి అనుకూలం
బాలానగర్ మండలంలోని పలు గ్రామాల్లో శనివారం మూడు గంటల సమయంలో భారీ వర్షం పడింది. వర్షానికి వరి పైరు నేలకొరుగగా, కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. వర్షంతో ఎండ వేడి నుంచి ప్రజలు ఉపశమనం పొందారు. ఈ వర్షం దుక్కులు దున్నడానికి అనుకూలంగా ఉందని రైతులు అంటున్నారు.
నేల వాలిన వరి
రాజాపూర్ మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని పలు గ్రామాల్లో శనివారం సాయంత్రం వర్షం పడింది. దాంతో కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. కోయని చోట పంట నేలవాలింది. చేతికొచ్చిన పంట నేలపాలవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
దెబ్బతిన్న ఇటుక బట్టీలు
నవాబ్పేట మండలంలోని వివిధ గ్రామాల్లో శనివారం సాయంత్రం మోస్తరు వర్షం కురిసింది. యన్మనగండ్ల, రుక్కంపల్లి, చెన్నారెడ్డిపల్లి, నవాబ్పేట తదితర గ్రామాల్లో వర్షం పడింది. పలు గ్రామాల్లో వరి పంటకు, యన్మనగండ్లలో ఇటుక బట్టీలకు నష్టం వాటిల్లింది. రైతు ముజ్జకీర్ పుచ్చకాయ తోట దెబ్బతిన్నంది. ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు.
సాగుకు రైతన్న సన్నద్ధం
వారం రోజుల్లో నైరూతి రుతుపవనాలు వస్తాయని వాతావరణ శాఖ చెప్పినట్లుగానే మహబూబ్నగర్ జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం జిల్లాలోని పలు మండలాల్లో మోస్తారు నుంచి భారీ వర్షం కురవగా శనివారం కూడా పలు మండలాల్లో మంచి వానలే పడ్డాయి. మధ్యాహ్నం నుంచే ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది. భారీ వర్షం పడటంతో దుక్కి దున్నేందుకు అన్నదాతలు రెడీ అవుతున్నారు. ఈనెల 25 నుంచి రోహిణి కార్తె ప్రారంభం అవుతుంది. ఆ కార్తెలో విత్తనాలు వేయడం, వరి నారుమళ్లు చేస్తుంటారు.
పెంట్లవెల్లిలో 68 మిల్లీ మీటర్ల వర్షం
నాగర్కర్నూల్ జిల్లాలో శుక్రవారం రాత్రి, శనివారం వర్షం కురిసింది. శుక్రవారం రాత్రి పెంట్లవెల్లిలో అత్యధికంగా 68 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. కొల్లాపూర్లో 11 మిల్లీ మీటర్లు, అచ్చంపేటలో 10.5, పెద్దకొత్తపల్లిలో 5.5, కోడేరులో 2.5, వంగూరులో 1.8, బిజినేపల్లిలో 1.5, బల్మూరులో 1.3, తెలకపల్లిలో ఒక మిల్లీ మీటరు వర్షపాతం నమోదైంది. శనివారం మధ్యాహ్నం జిల్లాలో స్వల్ప వర్షం పడింది. బిజినేపల్లి మండలంలోని పాలెంలో 4.3 మిల్లీ మీటర్ల వర్షం కురువగా, నాగర్కర్నూల్ మండలం కుమ్మెరలో రెండు మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షంతో జిల్లాలో వాతావరణం చల్లబడింది. గరిష్ఠంగా 27 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, కనిష్ఠంగా 25 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
గద్వాలలో చిరు జల్లులు
జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్లో శుక్రవారం రాత్రి నుంచి తెల్లవారుజామున వరకు వర్షం కురిసింది. 48 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. శనివారం సాయంత్రం గద్వాలలో చిరుజల్లులు పడ్డాయి.