హైదరాబాద్, మార్చి 27: యేళ్లకేళ్లుగా నానుతున్న 2018 బ్యాచ్ కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఎట్టకేలకు సర్కార్ గుడ్న్యూస్ చెప్పింది. ఈ అభ్యర్ధులకు త్వరలోనే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభంకానుందని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఛైర్మన్ వెల్లడించారు. ఆయన ఈ మేరకు వెల్లడించారని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్, ప్రజావాణి ఇన్ఛార్జి డాజి చిన్నారెడ్డి మీడియాకు తెలిపారు. మార్చి 25న ప్రజా భవన్లో కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు ఆయన్ను కలిసి నియామక ప్రక్రియపై వివరాలు కోరారగా.. స్పందించిన చిన్నారెడ్డి పోలీస్ రిక్రూట్మెంట్ ఛైర్మన్తో ఫోన్లో మాట్లాడారు. అనంతరం ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానున్నట్లు చెప్పడంతో అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేశారు.
విద్యార్థులు కనీస సామర్థ్యాలు చూపట్లేదు: సీఎం రేవంత్
తెలంగాణలో ప్రతిస్థాయిలో విద్యా రంగం రోజురోజుకూ క్షీణిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 2021లో 3, 5 తరగతుల విద్యార్థులపై నేషనల్ అచీవ్మెంట్ సర్వే జరిగిందని.. ఈ సర్వే ప్రకారం 75 శాతం మంది విద్యార్థులు కనీస సామర్థ్యాలు చూపట్లేదని సీఎం రేవంత్ అన్నారు. ఈ సర్వేలో తెలంగాణ చివరి నుంచి ఐదో స్థానంలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో 3వ తరగతి విద్యార్థులకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ పరిజ్ఞానంలో రాష్ట్రం 36వ స్థానంలో ఉందని, ఐదో తరగతి విద్యార్థులు రెండో తరగతి పుస్తకాలు కూడా చదవలేని పరిస్థితిలో ఉన్నట్లు తెలిపారు. విద్యార్ధుల్లో సామర్ధ్యాలు పెంచేందుకు చర్యలు చేపట్టాలని ఆధికారులను ఆదేశించారు.
విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణకు కమిటీ.. మంత్రి దామోదర్ రాజనర్సింహ
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణకు త్వరలో ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేస్తుందని మంత్రి దామోదర్ రాజనర్సింహ అసెంబ్లీలో తెలిపారు. ఈ మేరకు విద్యకు సంబంధించి పద్దులపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ.. 2014లో 28,405 పాఠశాలల్లో 27 లక్షల మంది విద్యార్థులు ఉన్నారని అన్నారు. ఆ సంఖ్య నేడు 19 లక్షలకు తగ్గిపోయిందని, గురుకులాల్లో 1.75 లక్షల విద్యార్థులు ఉండగా నాలుగు లక్షలకు పెరిగారని తెలిపారు. 1913 పాఠశాలల్లో జీరో ఎన్రోల్మెంట్ ఉండగా.. 73 పాఠశాలలను తిరిగి తెరుచుకున్నట్లు వెల్లడించారు. మౌలిక వసతుల కల్పనకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, మధ్యాహ్న భోజన ఛార్జీలు, ఏకరూప దుస్తుల కుట్టు ఛార్జీలు పెంచామని పేర్కొన్నారు.