గులాబీనేతల లెక్కల ప్రకారం.. డిసెంబర్9తో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తవుతోంది. ఇప్పటికే, కాంగ్రెస్ పార్టీ.. తమ ఏడాది పరిపాలనపై ప్రతి జిల్లాలోనూ విజయోత్సవ సభలు నిర్వహిస్తోంది. కరెక్టుగా, డిసెంబర్ 9నే అసెంబ్లీ సమావేశాలు కూడా మొదలుకానున్నాయి. దీంతో, ప్రతిపక్ష నేతగా కేసీఆర్ తన బాధ్యతను మరిచిపోవద్దనీ.. సభకు హాజరుకావాలనీ.. కేసిఆర్ రాకకోసం, ఎక్కిన వేదికమీదల్లా పిలుపునిస్తున్నారు, సవాల్ చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి. అందుకు ధీటుగా సీఎంపై… రివర్స్ కౌంటర్లు వేస్తున్నారు బీఆర్ఎస్ అగ్రనేతలు. అయితే, ఎంత రాజకీయ వేడి రాజుకున్నా.. కేసీఆర్ బయటికి రాకపోవడం గులాబీ శ్రేణులను కాసింత కలవరపెడుతోందనే చెప్పాలి. అయితే, నియోజకవర్గాలవారీగా పార్టీ కార్యకర్తలు, నేతలు.. ఫామ్ హౌస్కి వెళ్లి కేసీఆర్ని కలుస్తూనే ఉండటం విశేషం.
ఈ దఫా సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారా?
నేతలు,కార్యకర్తలతో వరుసగా భేటీ అవుతున్న కేసీఆర్… ఈ దఫా సమావేశాలకు హాజరవుతారా? ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారా? అన్నదే ఇప్పుడు సస్పెన్స్గా మారింది. ఇప్పటికే ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్న భారత రాష్ట్ర సమితికి… కేసీఆర్ రాక మరింత జోష్ తీసుకొస్తుందనడంలో సందేహం లేదు. అయితే, ఆయన రాకపై, బీఆర్ఎస్ వర్గాల్లోనూ స్పష్టత కనిపించడం లేదు. అయితే, అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహిస్తారు? ఏయే బిల్లులు సభలో ప్రవేశపెట్టనున్నారు? అనే విషయాలపై పూర్తిషెడ్యూల్ తెలిసాక కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని పార్టీవర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరైనా, ఆయనకు తగినప్రాధాన్యత ఉంటుందా? సభలో కేసీఆర్కు మైకు ఇవ్వకుండా ప్రభుత్వం అవమానిస్తే ఎలా? అనే అంశాలపై కూడా గులాబీ పార్టీ చర్చించుకుంటోంది. ఏదేమైనా, అధినేత ఆగమనానికి సమయం ఆసన్నమైందన్నది పార్టీ శ్రేణుల అభిప్రాయంగా గెలుస్తోంది. మరి, గులాబీ బాస్ ఏం చేస్తారో చూడాలి.