20 ఏళ్ల రాజకీయ ప్రస్థానం.. సీఎం రేవంత్‌రెడ్డి భావోద్వేగ పోస్ట్‌



హైదరాబాద్‌: ఇరవై ఏళ్ల రాజకీయ ప్రస్థానం తన జీవితంలో ప్రత్యేక అధ్యాయమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) అభివర్ణించారు. తన రెండు దశాబ్దాల రాజకీయ ప్రస్థానం గురించి ఎక్స్‌లో భావోద్వేగ పోస్ట్‌ చేశారు. ఈ 20వసంతాల ప్రయాణం ఎన్నో విజయాలు, మరెన్నో సవాళ్లు... ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం...అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలతోనే తన అనుబంధాన్ని కొనసాగించినట్లు తెలిపారు. మిడ్జిల్‌లో సాధారణ రాజకీయ కార్యకర్తగా ప్రారంభమైన తన ప్రయాణం, ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ప్రజల గుండెల్లో ‘రేవంతన్న’గా నిలిచే స్థాయికి చేరడం వెనుక ప్రజల విశ్వాసమే కారణమని సీఎం పేర్కొన్నారు. 


లక్షల అక్షరాలతో రాసినా... కోట్ల పదాలతో చెప్పినా... ఈ రెండు దశాబ్దాల ప్రజా జీవితం ఒక మధుర జ్ఞాపకమని పేర్కొన్న రేవంత్ రెడ్డి... ప్రతి సందర్భంలో, ప్రతి సంఘటనలో, ప్రతి సంఘర్షణలో తనతో కలిసి నడిచిన ప్రజలు, కార్యకర్తలు, ఆత్మీయులు, మిత్రులు, శ్రేయోభిలాషులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో ప్రజలకు మరింత సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతానని రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ పునర్నిర్మాణంలో శ్రామికుడిగా, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే సేవకుడిగా తన బాధ్యతను నిర్వర్తిస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా మాత్రమే కాకుండా...‘రేవంతన్న’గా ప్రజల హృదయాల్లో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంటానని భావోద్వేగంగా పేర్కొన్నారు.
Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow