*మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై సమస్యాత్మక గ్రామాలలో జిల్లా ఎస్పీ డి. జానకి విస్తృత పరిశీలన*
*-శాంతియుత ఎన్నికల నిర్వహణకు పటిష్ట భద్రత – ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి*
స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా బుధవారం జరగనున్న మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ డి.జానకి బాలానగర్ మండలం కేతిరెడ్డిపల్లి మరియు జడ్చర్ల మండలం లోని నసుర్లాబాద్ గ్రామాలలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలని మంగళవారం సందర్శించి ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో మాట్లాడి అవసరమైన సూచనలు జారీ చేశారు. అనంతరం గ్రామ ప్రజలతో మాట్లాడిన జిల్లా ఎస్పీ, ప్రతి ఓటరు ఎలాంటి భయభ్రాంతులు లేకుండా స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో ఏవైనా సమస్యలు, అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకునే అవకాశం ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా వ్యాప్తంగా పికెటింగ్, మొబైల్ పార్టీలు, స్ట్రైకింగ్ ఫోర్సులు మరియు ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్చర్ల రూరల్ సీఐ నాగార్జున గౌడ్, జడ్చర్ల టౌన్ ఇన్స్పెక్టర్ కమలాకర్, బాలానగర్ ఎస్సై లెనిన్తో పాటు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
