ఆ గ్రామంలో ఏడు దశాబ్దాలుగా అసలు సర్పంచ్ ఎన్నికల ముచ్చటే లేదు. పంచాయితీ ఎన్నికల్లో ఆ ఊరు ఓటు వేసిన దాఖలాలే లేవు. 70 ఏళ్లు దాటినా స్థానిక ఎన్నికల్లో చేతికి సిరా చుక్క తాకలేదు. కానీ చరిత్రను తిరగ రాస్తూ 7 దశాబ్దాల తర్వాత తొలిసారి పంచాయితీ ఎన్నికలను చూసింది ఆ గ్రామం. ఇంతకు ఆ గ్రామం ఏంది.. అక్కడ ఇన్నాళ్లు ఎందుకు ఎన్నికలు జరగలేదో తెలుసుకుందాం పదండి.
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం బరంపూర్ గ్రామ పంచాయతీలో ఏడు దశాబ్దాల ఆనవాయితీకి ఎట్టకేలకు బ్రేక్ పడింది. 69 ఏళ్లుగా ఏకగ్రీవం అవుతూ వస్తున్న పంచాయితీ స్థానం ఈసారి ఓటుకు సిద్దమైంది. గత ఏడు దశాబ్దాల ఆనవాయితీకి భిన్నంగా ఓటు హక్కు ద్వారా గెలుస్తామంటూ ఇద్దరు సర్పంచ్ అభ్యర్థులు బరిలోకి దిగడంతో బరంపూర్ లో పంచాయతీ ఎన్నికల కల నెరవేరింది. 1956 లో ఏర్పడిన ఈ పంచాయతీకి 69 ఏళ్లుగా పంచాయితీ ఎన్నికలు జరగడం లేదు. ప్రతి ఎన్నికల సమయంలో గ్రామ పెద్దల తీర్మానం తో ఏకగ్రీవాల పర్వం కొనసాగింది.
బరంపూర్ పంచాయతీ పరిధిలో మొత్తం పది వార్డులు ఉన్నాయి. సుమారు మూడు వేల జనభా ఉన్న ఈ గ్రామ పంచాయతీలో 2300 మంది ఓటర్లు ఉన్నారు. అయితే ఈ పంచాయతీ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు సర్పంచ్ స్థానానికి పోటీ లేకుండా గ్రామ పెద్దలు పూనుకొని ఏకగ్రీవం చేస్తూ వచ్చారు. గ్రామ ప్రజలు అందరు ఒకతాటి పైకి వచ్చి గ్రామాన్ని అభివృద్ది చేసుకుంటూ వచ్చారు. కానీ ఈసారి మాత్రం ఆ అనవాయితీ కొనసాగే పరిస్థితి లేకుండా పోయింది.