Hyderabad: చిన్న ఫిర్యాదును విచారిస్తే.. బయటపడ్డ కోట్ల రూపాయల స్కామ్..!
తీగ లాగితే డొంక కదలడం అంటే ఇదే..! హైదరాబాద్లో ఒక వ్యక్తి చేసిన చిన్న ఫిర్యాదు పెద్ద క్రైమ్ గుట్టును బయటపెట్టింది. ఓ వ్యక్తి తనను అప్రోచ్ అయి బ్యాంక్ అకౌంట్ వివరాలు అడిగారని, అలా చేస్తే రూ.10 వేలు డబ్బులు ఇస్తామని చెప్పాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగం దర్యాప్తు ప్రారంభించింది. ఆ లీడ్ను పట్టుకుని చేసిన విచారణలో భారీ నకిలీ బ్యాంక్ అకౌంట్ రాకెట్ బయటపడింది.
రాజస్థాన్కు చెందిన కన్నయ్య అనే వ్యక్తి నగరంలో ఆటోలో ప్రయాణిస్తూ డ్రైవర్లతో పరిచయం పెంచుకున్నాడు. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తే పది వేల రూపాయలు ఇస్తానని చెప్పి ఒక్కో డ్రైవర్ను నమ్మించాడు. ట్రాన్సాక్షన్లన్నీ తానే చూసుకుంటానని చెప్పడంతో డ్రైవర్లు ఎలాంటి అనుమానం లేకుండా తమ ఫోటోలు, ఐడీ ప్రూఫ్లు ఇచ్చారు. అంతటితో ఆగకుండా భార్య, బంధువులు, తెలిసినవారి వివరాలను కూడా ఇవ్వడం ప్రారంభించారు. కన్నయ్య ఈ వివరాలన్నింటిని వాడుకుని కొత్త బ్యాంక్ అకౌంట్లు తెరిచాడు.
ఈ అకౌంట్ల ఓపెనింగ్లో జూబ్లీహిల్స్లోని కరూర్ వైశ్య బ్యాంక్ బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ బాలాజీ నాయక్ నిందితులకు సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. ఒక్కో అకౌంట్కు పదిహేను వేల రూపాయలు తీసుకుని అకౌంట్లు తెరిచినట్లు వెల్లడైంది. ఈ విధంగా మొత్తం 127 బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ అయి సైబర్ నేరగాళ్లకు చేరాయి. ఈ అకౌంట్లతో పలువురు మోసగాళ్లు ఆన్లైన్లో భారీ మోసాలు చేశారు. ఆరు కేసుల్లో మొత్తం 24 కోట్ల రూపాయలు దోచుకున్నారు. అందులో రూ. 23.9 కోట్లు వెంటనే విత్డ్రా చేసేశారు.
ఆన్లైన్ మోసాలు, ఫ్రాడ్ ట్రాన్సాక్షన్లకు ఈ అకౌంట్స్ వాడినట్లు పోలీసుల విచారణలో తేలింది. పోలీసుల దాడుల్లో 11 పాస్బుక్స్, 14 ఏటీఎం కార్డులు, బయోమెట్రిక్ డివైజ్, మొబైల్ ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో పాల్గొన్న ఆటో డ్రైవర్లు పూజారి జగదీష్, సునీల్ కుమార్, మణిదీప్, బ్లూ డార్ట్ డెలివరీ బాయ్ నిఖిల్, హార్డ్వేర్ టెక్నీషియన్ బాలు, ఫోటోగ్రాఫర్ బత్తుల పవన్, ప్రవీణ్, బ్యాంక్ ఉద్యోగి బాలాజీ నాయక్ను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితులు అయిన కన్నయ్య, రమేష్, పూనమ్ రాజస్థాన్కు పారిపోయినట్లు తెలిసింది. ఈస్ట్ జోన్ టాస్క్ఫోర్స్, సైబర్ క్రైమ్ టీమ్ కలిసి ఈ పెద్ద రాకెట్ను ఛేదించారు. చిన్న బ్యాంక్ అకౌంట్ వివరాలకు మనీ ఎక్స్ఛేంజ్ ఆఫర్తో ప్రారంభమైన మాయ.. కోట్ల రూపాయలు నేరంగా మారడం పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. ఈ కేసుపై లోతైన దర్యాప్తు చేస్తున్నట్లు అడిషనల్ సీపీ శ్రీనివాసులు తెలిపారు.