తెలంగాణలో స్థానిక ఎన్నికలకు (Local Body Elections) తొలి విడత నామినేషన్ల గడువు ముగిసింది. తొలి విడతలో 4,236 పంచాయతీలు, 37,440 వార్డుల్లో ఎన్నికలు జరుగనున్నాయి. డిసెంబర్ 3వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. నామినేషన్ల సందర్భంగా ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తొలి విడత నామినేషన్ల గడువు ఈరోజు యుగియడంతో రెండో విడత పంచాయతీ ఎన్నికల ప్రక్రియ రేపటి(ఆదివారం) నుంచి ప్రారంభం కానుంది.
డిసెంబర్ 2వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు ఎన్నికల అధికారులు. డిసెంబర్ 6వ తేదీన రెండో విడత నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుంది.
కాగా, పలు జిల్లాల్లో సర్పంచ్ పదవికి జోరుగా వేలం పాటలు జరుగుతున్నాయి. సర్పంచ్ పదవీ కోసం పలువురు పోటీపడుతున్నారు. సర్పంచ్ పదవి ఏకగ్రీవం చేయడం కోసం ఎంత ఖర్చు పెట్టెందుకైనా వెనుకడుగు వేయడం లేదు.
అయితే, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభ్యర్థుల తరఫున ప్రచారం చేయనున్నారు. ఈ మేరకు పలు జిల్లాల్లో పర్యటిస్తున్నట్లు సీఎం ఓ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే.
మరోవైపు.. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై తెలంగాణ హైకోర్టు కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. జీఓ నంబరు 46పై హైకోర్టులో నిన్న(శుక్రవారం) విచారణ జరిగింది. ఈ దశలో ఎన్నికలపై స్టే విధించలేమని స్పష్టం చేసింది న్యాయస్థానం. పాత పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించమని తామే చెప్పాం కదా అని న్యాయస్థానం గుర్తుచేసింది. జీఓ నంబరు 46పై తదుపరి విచారణను రెండు నెలలకు వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు.