ఈ ఏడాది మండల పూజలకోసం శబరిమల అయ్యప్ప ఆలయ ద్వారాలు నవంబరు 16 ఆదివారం సాయంత్రం తెరుచుకున్నాయి. సోమవారం తెల్లవారుజామున నుంచి భక్తులను దర్శనాలకు అనుమతిస్తున్నారు. ఈ క్రమంలో శబరిమలకు భక్తులు పోటెత్తుతున్నారు. స్వామియే శరణం అయ్యప్ప నామస్మరణతో శబరిగిరులు మార్మోగుతున్నాయి. మండల పూజ ప్రారంభం నుంచే శబరిమలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. స్వామివారి దర్శనానికి 15 నుంచి 18 గంటల సమయం పడుతోంది. పవిత్రమైన 18 మెట్ల దగ్గర భక్తుల ప్రవాహం గణనీయంగా మందగించడంతో, సన్నిధానం నుంచి క్యూలైన్లలో కిలోమీటర్ల మేర బారులు తీరుతున్నారు. విపరీతమైన రద్దీ, కనీస సౌకర్యాల లేమి, అధికారుల వైఫల్యంతో అయ్యప్ప భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రద్దీని నియంత్రించేందుకు దర్శన సమయాన్ని రెండు గంటల పాటు పొడిగించినా పరిస్థితి అదుపులోకి రాలేదు. త్రాగునీరు, ఆహారం అందక, గంటల తరబడి నిల్చోవడంతో చిన్నారులు, వృద్ధులు క్యూలైన్లలోనే సొమ్మసిల్లి పడిపోతున్నారు. ఇలాగే ఓ భక్తురాలు కుప్పకూలి మృతిచెందింది. భారీ క్యూలైన్ల కారణంగా ఆమె ఊపిరాడక.. ఉక్కిరిబిక్కిరి అయ్యి.. మరణించినట్లు తెలుస్తోంది. అప్రమత్తమైన ఆలయ అధికారులు శబరిమల పరిసరాల్లో 17 మెడికల్ ఎమర్జెన్సీ సెంటర్లు ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీకి అనుగుణంగా సరైన ఏర్పాట్లు చేయలేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం ఆలయం తలుపులు తెరుచుకోగా.. సోమవారం రికార్డు స్థాయిలో లక్షా 25వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. రోజుకు 90 వేల మందికి మాత్రమే దర్శనం కల్పించాలని నిర్ణయించినప్పటికీ, లక్షకు పైగా భక్తులు వస్తుండటంతో ఏర్పాట్లు సరిపోలేదు. ఇదే పరిస్థితి కొనసాగితే, గతేడాది నాటి సంక్షోభం పునరావృతం అవుతుందని, ఎంతోమంది భక్తులు యాత్రను మధ్యలోనే విరమించుకోవాల్సి వస్తుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.