తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు పొంచి ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఫ్లాష్ ఫ్లడ్ వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD)హెచ్చరికలు జారీ చేసింది. ఏపీ, తెలంగాణతో పాటు మహారాష్ట్ర, విదర్భా ప్రాంతాలకు రాబోయే కొన్ని గంటల్లో తక్షణ వరద ముప్పు పొంచి ఉందని ఐఎండీ ప్రకటించింది. రాబోయే ఆరు గంటల్లో ఏపీలో, 24 గంటల్లో తెలంగాణ, విదర్భా, మరాఠవాడాలో తీవ్ర వర్షపాతం వల్ల వరద వచ్చే ఛాన్స్ ఉందనిపేర్కొంది. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచే అవకాశం ఉందని, వరద ప్రభావంతో రహదారులపై నీరు వచ్చి చేరవచ్చని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీర ప్రాంతమైన యానంతో పాటు గుంటూరు, ప్రకాశం జిల్లాలకు ఈ ముప్పు పొంచి ఉంది.
తెలంగాణ రాష్ట్రం: ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, సిద్దిపేట, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగాం, యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్, మెదక్, మేడ్చల్–మల్కాజ్గిరి, పెద్దపల్లి జిల్లా.
మరాఠవాడా సమీప ప్రాంతాలు: నాందేడ్, హింగోలి, పర్బణీ.
విదర్భా ప్రాంతం (మహారాష్ట్ర):
బుల్దానా, అకొలా, అమరావతి, వార్ధా, యవత్మాల్, నాగ్పూర్ జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చికలు జారీ అయ్యాయి.
ప్రజలకు సూచనలు:
వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లొదని.. వాగులు, కాల్వలు, చెరువుల దగ్గర తిరగవద్దని ఐఎండీ హెచ్చరించింది. ప్రయాణం ముందు వాతావరణ సమాచారం తెలుసుకోవాలని సూచించింది. రైతులు పంటలు, పశువులను సురక్షిత ప్రదేశాలకు తరలించాలని.. స్థానిక అధికారులు అత్యవసర సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని వాతావరణ శాఖ సూచించింది.
ఎమర్జెన్సీలో..
అత్యవసర పరిస్థితుల్లో ఆయా జిల్లాల డిజాస్టర్ కంట్రోల్ రూమ్, స్థానిక సహాయ కేంద్రానికి సమాచారం ఇవ్వాలని సూచనలు చేసింది. ఐఎండీ, రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ నుంచి జారీ అయ్యే తాజా సమాచారం తప్పకుండా పాటించాలని భారత వాతవారణ శాఖ పేర్కొంది.