నంద్యాల, అక్టోబర్ 29: మొంథా తుపాను ప్రభావంతో శ్రీశైలంలో ఎడతెరపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. శ్రీశైలం రోప్ వే సమీపంలోని పాతాళగంగ వద్ద మూడు షాపులపై భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో షాపులు ధ్వంసమయ్యాయి. దీంతో శ్రీశైలం సమీపంలోని ఇష్టకామేశ్వరి అమ్మవారి దర్శనాలను తాత్కాలికంగా నిలుపుదల చేశారు. ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయానికి వెళ్లే మార్గంలో రోడ్డుపైకి వర్షపు నీరు పొంగిపొర్లుతోంది. శ్రీశైలం - దోర్నాల ఘాట్ రోడ్డులో వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి. శ్రీశైలం నుంచి దోర్నాల వెళ్లె ఘాట్ రోడ్డులోని తుమ్మలబైలు, చింతల వద్ద రోడ్డుపైకి వర్షపు నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. శ్రీశైలం డ్యామ్ సమీపంలోని లింగాలగట్టు వద్ద చిన్న బ్రిడ్జ్ నుంచి వర్షపు నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో మత్స్యకారులు భయాందోళనవ్యక్తం చేశారు. ఇక మొంథా తుపాను ఎఫెక్ట్తో శ్రీశైలం ఆలయానికి భక్తుల రద్దీ తగ్గింది.
మరోవైపు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాలూకాలో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఖాదర బాదర గ్రామ సమీపంలో ఒక్కిలేరు వాగు ముంచెత్తడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చిన్న కంబలూరు , కొండమాయపల్లె , రుద్రవరం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. శిరివెళ్ళలో ఏపీఎస్ఆర్టీసీ సేవలను నిలిచాయి. దీంతో ప్రయాణికులు , వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, రెవెన్యూ సిబ్బంది.. వాగు వద్ద భద్రతా చర్యలు చేపట్టారు.
పేరూరు - చందలూరులపై నుంచి రాకపోకలు కొనసాగుతున్నాయి. ఎడతెరపి లేని భారీవర్షాల వల్ల పలు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పొలాలకు వెళ్లే రైతులు, అవసరాల కోసం బయలుదేరే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రమాదకర వాగుల్లో రాకపోకలు సాగించవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.