క్రికెట్ యువ సంచలనం, యూనివర్స్ బేబీ బాస్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) జాతీయ జట్టులో అరంగేట్రం చేస్తున్నాడు. మరికొద్ది రోజుల్లో అతడు టీమ్ఇండియా తరఫున తొలి మ్యాచ్ ఆడనున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా భారత జెర్సీని అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ తాజాగా సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకుంది.
‘‘యావత్ దేశం ఎదురుచూస్తున్న క్షణం వచ్చేసింది. వైభవ్ సూర్యవంశీ టీమ్ఇండియా జెర్సీని అందుకున్నాడు. ఆ అద్భుత క్షణాలను మీరూ చూసేయ్యండి’’ అని బీసీసీఐ రాసుకొచ్చింది. ఈ యువ సెన్సేషన్ ‘నంబరు 3’తో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిం
చనున్నాడు. ప్రఖ్యాత త్రోడౌన్ స్పెషలిస్టు రఘు నుంచి వైభవ్ ఈ జెర్సీని అందుకున్నాడు. ఈ జెర్సీ ఇచ్చేందుకు రఘు గది వద్దకు రాగానే.. వైభవ్ అతడి కాళ్లకు నమస్కరించడం వీడియోలో కన్పించింది.
ఈ సందర్భంగా వైభవ్ మాట్లాడుతూ.. ‘‘కొన్ని సార్లు మనం ఊహించని అద్భుతాలు జరుగుతుంటాయి. అలాంటి క్షణాల్లో ఎలా స్పందించాలో కూడా అర్థం కాదు. ప్రస్తుతం నేను అలాంటి పరిస్థితిలోనే ఉన్నా. క్రికెట్ బ్యాట్ పట్టుకుని గ్రౌండ్లో ప్రాక్టీస్కు వెళ్లిన తొలి రోజు నుంచే.. టీమ్ఇండియా జెర్సీ వేసుకోవాలని కలలు కన్నా. ఈ రోజు ఆ కల నెరవేరింది. నా క్రికెట్ ప్రయాణంలో కీలక దశ మొదలైంది. టీమ్ఇండియా జెర్సీ నా చేతికొచ్చింది. ఈ ఆనందాన్ని నేను మాటల్లో వర్ణించలేను. ఇదంతా ఓ కలలా ఉంది. జెర్సీని చేతిలో తీసుకోగానే సంతోషం పట్టలేకపోయా’’ అని తన ఆనందాన్ని పంచుకున్నాడు.
గతంలో నంబరు 3 జెర్సీతో హర్భజన్ సింగ్, సురేశ్ రైనా జాతీయ జట్టులో ఆడారు. వారు రిటైర్మెంట్ తీసుకోవడంతో ఆ నంబరును ఇప్పుడు వైభవ్కు కేటాయించారు. కాగా.. మరికొద్ది రోజుల్లో ఐర్లాండ్, ఇంగ్లాండ్తో జరగబోయే టీ20 సిరీస్లకు వైభవ్ను బీసీసీఐ ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అయితే, తుది జట్టులో అతడికి చోటు దక్కుతుందా లేదా అనేదానిపై సందిగ్ధత కొనసాగుతోంది. ఓపెనర్ స్థానం కోసం అతడు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్ వంటి సీనియర్లతో పోటీ పడాల్సి ఉంటుంది.
Tags
india