ముందుగానే ఇంటర్ పబ్లిక్‌ పరీక్షలు! ఎప్పట్నుంచంటే

 TG Inter Public Exams 2026: విద్యార్ధులకు అలర్ట్.. తెలంగాణలోనూ కాస్త ముందుగానే ఇంటర్ పబ్లిక్‌ పరీక్షలు! ఎప్పట్నుంచంటే



Telangana Inter public exams 2026 time table: రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు ఈసారి కాస్త ముందుగానే ప్రారంభంకానున్నాయి. ఇప్పటికే ఏపీలో ఇంటర్‌ పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ప్రారంభంకానున్నట్లు ప్రకటన వెలువడింది. ఇందుక సంబంధించిన టైం టేబుల్ కూడా అక్కడి ఇంటర్ బోర్డు తాజాగా విడుదల చేసింది

హైదరాబాద్‌, అక్టోబర్‌ 15: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు ఈసారి కాస్త ముందుగానే ప్రారంభంకానున్నాయి. ఇప్పటికే ఏపీలో ఇంటర్‌ పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ప్రారంభంకానున్నట్లు ప్రకటన వెలువడింది. ఇందుక సంబంధించిన టైం టేబుల్ కూడా అక్కడి ఇంటర్ బోర్డు తాజాగా విడుదల చేసింది. ఇక ఇదే పంథాలో తెలంగాణ ఇంటరో బోర్డు కూడా అడుగులు వేస్తుంది. తెలంగాణలో కూడా ఇంటర్ ఫస్ట్, సెకండ్‌ ఇయర్‌ పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలాఖరు నుంచే ప్రారంభించనున్నట్లు తాజాగా ప్రకటించింది. ఈ మేరకు ఇంటర్‌ బోర్డు రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం కోసం నివేదికను పంపింది.


ప్రభుత్వం ఆమోదం తెలియజేస్తే 2026 ఫిబ్రవరి 23 లేదా 25 నుంచి ఇంటర్ పబ్లిక్‌ పరీక్షలు మొదలవనున్నాయి. ఈ మేరకు రెండు రకాల టైం టేబుళ్లను సర్కారుకు పంపారు. రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా సీఎం రేవంత్‌రెడ్డి కొనసాగుతున్నందున ఆయన ఆమోదం తర్వాతనే ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించనున్నారు. మరోవైపు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభమై.. మార్చి 24వ తేదీతో ముగియనున్నాయి. సరిగ్గా ఇదే తేదీల్లో తెలంగాణలోనూ ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. లేదంటే ఒక రోజు అటుఇటుగా మొదలవుతాయి. అయితే ఏపీ కంటే ముందుగానే ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షలు తెలంగాణలో పూర్తయ్యే అవకాశం ఉంది.


గతంలో అంటే కరోనాకు ముందు ఫిబ్రవరి నెలాఖరులోనే పరీక్షలు మొదలయ్యేవి. కరోనా మహమ్మారి ప్రభావంతో ఇది కాస్తా మార్చికి మారింది. అప్పటి నుంచి మార్చిలోనే ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయి. అయితే ఫిబ్రవరిలోనే ఇంటర్ పరీక్షలు జరిగితే జేఈఈ మెయిన్, ఈఏపీసెట్, నీట్‌కు సన్నద్ధమయ్యే వారికి కాస్త వెసులుబాటు లభిస్తుంది. గత ఏడాది మార్చి 5న ఇంటర్‌ పరీక్షలు మొదలయ్యాయి. మరోవైపు జేఈఈ మెయిన్‌ రెండో సెషన్‌ పరీక్షలు ఏప్రిల్‌ 2 నుంచి ప్రారంభమయ్యాయి. దాంతో ఇంటర్ పరీక్షలు రాసిన వారికి కేవలం 12 రోజులు మాత్రమే సన్నద్ధతకు లభించాయి. దీంతో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. గతేడాది రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్‌ ఫస్ట్, సెకండ్‌ ఇయర్‌ పబ్లిక్‌ పరీక్షలకు దాదాపు 9 లక్షల మందికిపైగా విద్యార్ధులు హాజరయ్యారు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలోనే పరీక్షలు మొదలైతే విద్యార్ధులకు ఇతర నీట్, జేఈఈ వంటి పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు సమయం లభిస్తుంది.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow