రాగల రెండు-మూడు గంటలలో భారీ వర్షం!
హైదరాబాద్: నగరంలో మరోసారి వర్షం మొదలైంది. ఇవాళ(గురువారం) నగరంలోని పలు చోట్ల ఇప్పటికే కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగే పరిస్థితికి చేరుకున్నాయి. పంజాగుట్ట, అమీర్ పేట్, కూకట్ పల్లి, సికింద్రాబాద్, బోయినపల్లి, తిరుమలగిరి, అల్వాల్, ప్యాట్నీ, తార్నాక, ఎల్బీనగర్, పాతబస్తీ ప్రాంతాల్లో వర్షం పడింది. ఉదయం నుంచి ఉక్కపోత వాతావరణంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నగరవాసులకు ఈ వర్షం కాస్త ఉపశమనం కలిగించింది.
నగరంలో కొన్ని గంటల నుంచి నిరంతరాయంగా కురుస్తున్న వర్షంతో రహదారులపై నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. ఒక్కసారిగా కురిసిన వాన వరదలా మారడంతో ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. యూసఫ్గూడ, మధురానగర్, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, ఎర్రగడ్డ, సనత్ నగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో ఈ వర్షాలు మొదలయ్యాయని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే నాలుగు రోజులు రాష్ట్రంలో ఉరుములతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కూడా ఇవాళ(గురువారం) వర్షం కురిసింది. ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసినట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది