సంగారెడ్డి జిల్లా: పఠాన్చెరు (Pathan Cheru) మండలం పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి కెమికల్స్ పరిశ్రమలో ఇవాళ (సోమవారం) భారీ పేలుడు (Huge Explosion) సంభవించింది. పరిశ్రమలో మంటలు ఎగసిపడుతున్నాయి. ఈ ప్రమాదం వల్ల 12 మంది మృతిచెందగా.. మరో 15 మందికిపైగా తీవ్రగాయాలు అవడంతో వెంటనే నగరంలోని పలు ఆస్పత్రులకి తరలించారు. పేలుడు ధాటికి కార్మికులు ఎగిరిపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని అధికారులు చెబుతున్నారు. పలువురు కార్మికులు మంటల్లో చిక్కుకున్నారు. మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. రియాక్టర్ పేలడంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
ఈ ప్రమాదంతో స్థానికులు, కార్మికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సిగాచి కెమికల్స్ ఫ్యాక్టరీ పరిసరాల్లో దట్టమైన పొగ అలుముకుంది. ఘాటైన వాసనతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. చుట్టుపక్కల వారిని అధికారులు ఖాళీ చేయించారు. ఘటనాస్థలికి ఎవరూ రావొద్దని అధికారులు సూచించారు. పేలుడు ధాటికి పరిశ్రమ భవనం కుప్పకూలాగా, మరో భవనానికి బీటలు వచ్చాయి. ఫ్యాక్టరీలో ఒడిశా, ఇతర రాష్ట్రాల కార్మికులు పనిచేస్తున్నారు. వారిని అక్కడి నుంచి దూరంగా పంపించి వేస్తున్నారు. పోలీసులతో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, హైడ్రా, రెవెన్యూ అధికారులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. సహాయ చర్యలను ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. సంఘటన స్థలానికి మంత్రులు దామోదర రాజనర్సింహ, వివేక్ వెంకటస్వామి, పఠాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మల్టీజోన్ టు ఐజీ సత్యనారాయణ, ఎస్పీ పరితోష్ పంకజ్ చేరుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
పాశమైలారం భారీ అగ్నిప్రమాదం.. సీఎం రేవంత్రెడ్డి కీలక ఆదేశాలు
సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం జరిగి కార్మికులు అందులో చిక్కుకోవడం అత్యంత విషాదకరమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్రావు అన్నారు. కార్మికులు, సిబ్బందిని కాపాడేందుకు అవసరమైన అన్నిచర్యలు వెంటనే చేపట్టాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని మాజీ మంత్రి హరీష్రావు కోరారు.
పాషమైలారంలోని సిగాచి పరిశ్రమలో పేలుడు సంభవించిందని మాజీ మంత్రి హరీష్రావు అన్నారు. భూమి కంపించేంత శబ్దం వచ్చిందని తెలిపారు. 149మంది వరకు ఈ పరిశ్రమలో ఉదయం పని చేశారని వెల్లడించారు. ఈ ప్రమాదంలో నాలుగు అంతస్థుల భవనం కుప్పకూలిందని.. 8మంది చనిపోయారని అన్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పారు. బీహార్, చత్తీస్ఘడ్తో పాటు, తెలుగు వాళ్లు కూడా ఈ పరిశ్రమలో పనిచేస్తున్నారని తెలిపారు. పరిశ్రమలో పనిచేసే వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. తొమ్మిది గంటలకు ఈ ప్రమాదం జరిగితే ఐదు గంటల నుంచి ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పారు. ఈ ఘటనపై కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ ప్రమాదంపై చాలా నిర్లక్ష్యంగా ప్రభుత్వం ఉందని ఆరోపించారు. ఎంతమంది చనిపోయారో అనేది ఇంకా క్లారిటీ లేదని అన్నారు. డ్యూటీలో ఎంతమంది ఉన్నారో ఒక్కొక్క అధికారి ఒక్కొక్క డేటా చెబుతున్నారని తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులు తీవ్ర దు:ఖంతో ఉన్నారని అన్నారు. లోపల పనిచేసే కార్మికులు 60 నుంచి 70 శాతం వరకు కాలిపోయారని చెప్పారు. ప్రమాదం జరిగిన వెంటనే చికిత్స అందిస్తే ప్రాణాలు దక్కేవని తెలిపారు. ఈ ఘటనలో చర్యలు చేపట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి వైఫల్యం చెందిందని విమర్శించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.50లక్షలు ఏక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.