పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో జమ్ముకశ్మీర్లో సైన్యం సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. భద్రతా బలగాలు ప్రస్తుతం బిజ్బెహరా, త్రాల్ ప్రాంతాల్లో కూంబింగ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా జమ్ముకశ్మీర్లో లోకల్ టెర్రరిస్ట్ల నివాసాలపై దాడి చేస్తున్నారు. ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో.. కుల్నార్ బాజీపురాలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేశారు..
పహల్గామ్, ఏప్రిల్ 25: పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో జమ్ముకశ్మీర్లో సైన్యం సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. భద్రతా బలగాలు ప్రస్తుతం బిజ్బెహరా, త్రాల్ ప్రాంతాల్లో కూంబింగ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా జమ్ముకశ్మీర్లో లోకల్ టెర్రరిస్ట్ల నివాసాలపై దాడి చేస్తున్నారు. జమ్ముకశ్మీర్లోని బందీపురా జిల్లాలో ఎన్కౌంటర్ చేశారు. ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో.. కుల్నార్ బాజీపురాలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేశారు. జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా జిల్లాలోని ట్రాల్లోని మోంఘమా ప్రాంతంలో ఓ ఉగ్రవాది ఇంటిని సైన్యం గుర్తించింది. ఐఈడీ బాంబులతో ఉగ్రవాది ఇంటిని బలగాలు పేల్చేశాయి. ఆ ఇల్లు ఆసిఫ్ షేక్ అనే ఉగ్రవాదిదని అధికారులు గుర్తించారు. ఏప్రిల్ 22న పహల్గామ్ లోయలో పర్యాటకులపై జరిపిన దాడిలో 26 మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్న ఉగ్రమూకలో ఆసిఫ్ షేక్ పేరు తెరపైకి వచ్చింది. దీంతో అతడి కోసం ముమ్మర దర్యాప్తు జరుగుతుంది. సమాచారం ప్రకారం లష్కరే తోయిబా (LeT) స్థానిక కమాండర్గా ఆసిఫ్ షేక్ వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. భద్రతా దళాలు ఆ ప్రాంతంలో తనిఖీలు నిర్వహిస్తున్నప్పుడు ఆ ప్రాంగణంలో కొన్ని అనుమానాస్పద వస్తువులను గమనించారు. ప్రమాదాన్ని గ్రహించిన సిబ్బంది వెంటనే ఆ ప్రదేశం నుంచి వెనక్కి వెళ్లి.. ఆ తర్వాత కొద్దిసేపటికే భారీ పేలుడుతో ఇంటిని ధ్వంసం చేశారు. దీంతో ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. పేలుడుకు సంబంధించి ఖచ్చితమైన వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు. ధ్వంసం చేసిన ఇంటిలో పేలుడు పదార్థాలు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం అందినట్లు ఒక పోలీసు అధికారి తెలిపారు.
పహల్గామ్లో జరిగిన పాశవిక ఉగ్రవాద దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులు మొత్తం ఐదు నుంచి ఏడు వరకు ఉండవచ్చని, పాకిస్తాన్లో శిక్షణ పొందిన ఇద్దరు స్థానిక ఉగ్రవాదుల సహాయంతో ఈ దాడి జరిగిందని అధికారులు తెలిపారు. ఘటనా స్థలంలో ప్రత్యక్ష సాక్షుల ప్రకారం బిజ్బెహారా నివాసి ఆదిల్ థోకర్ అలియాస్ ఆసిఫ్ షేక్ అనే ఉగ్రవాది కూడా ఉన్నట్లు బయటపడింది. ఉగ్రవాద దాడిలో పాల్గొన్నట్లు అనుమానిస్తున్న ముగ్గురు ఉగ్రవాదుల స్కెచ్లను భద్రతా సంస్థలు కూడా విడుదల చేశాయి. ఆ ముగ్గురు ఉగ్రవాదులు ఆసిఫ్ ఫౌజీ, సులేమాన్ షా, అబు తల్హా అని అధికారులు తెలిపారు. వారికి మూసా, యూనస్, ఆసిఫ్ అనే కోడ్ పేర్లు ఉన్నాయి. వీరు పూంచ్లో ఉగ్రవాద సంబంధిత సంఘటనలకు పాల్పడినట్లు అధికారులు తెలిపారు.
Tags
india