భారత కరెన్సీకి సంబంధించి ఇటీవలి కాలంలో రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి. సోషల్ మీడియాలో అయితే ఇక లెక్కే లేదు. ఫేక్ పోస్ట్లు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐదు వేల రూపాయల నోట్లను విడుదల చేయబోతోందంటూ ఒక ప్రచారం సోషల్ మీడియాలో మొదలైంది. ఆ నోటు ఇలా ఉంది.. దాని రంగు, రూపు రేఖలు ఇవే అంటూ రచ్చ చేస్తున్నారు. ఆకుపచ్చ రంగులో ఉన్న 5000 రూపాయల నోటు నెట్టింట్ట వైరల్ చేశారు. దీనిని నమ్మి చాలా మంది సోషల్ మీడియా యూజర్లు ఏమాత్రం ఆలోచించకుండా ఈ వార్తలను షేర్ చేస్తున్నారు. మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిజంగానే రూ.5000. కొత్త నోటును జారీ చేసిందా.. చేయనుందా.. అసలు ఈ ప్రచారంలో ఉన్న వాస్తవం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..వైరల్ పోస్ట్లో ఏముంది?
‘బిగ్ న్యూస్.. కొత్త 5000 రూపాయల నోటు విడుదల, RBI ఈ సమాచారాన్ని ఇచ్చింది. 5000 కొత్త నోటు ఇదే’ అంటూ రాజ్ షేక్ అనే సోషల్ మీడియా యూజర్ పోస్ట్ చేశాడు. అతను అలా పోస్ట్ చేయడమే ఆలస్యం.. అదికాస్తా తెగ వైరల్ అయ్యింది. ఈ 5000 నోట్ నిజమని నమ్మిన ఇతర యూజర్లు.. షేర్ చేశారు. ఈ విషయం అటు తిరిగి ఇటు తిరిగి అధికారుల దృష్టికి చేరింది. రూ. 5000 నోట్ జారీపై క్లారిటీ ఇచ్చారు. ఇది ఫేక్ అని క్లారిటీ ఇచ్చేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీనిపై ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం 10, 20, 50, 100, 200, 500 రూ. లు నోట్లు మాత్రమే చెలామణిలో ఉన్నాయని క్లారిటీ ఇచ్చారు. రూ. 5,000 నోట్లను విడుదల చేసే ఆలోచన లేదని ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. కొత్తగా అధిక విలువ కలిగిన కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టే మూడ్లో ఆర్బీఐ లేదన్నారు. ప్రస్తుతం దేశంలో ఉన్న కరెన్సీ వ్యవస్థ దేశ ఆర్థిక అవసరాలకు సరిపోతుందని పేర్కొన్నారు. పెద్దగా మార్పులు చేయాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వం కూడా డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తోందని.. యూపీఐ, ఇంటర్నెట్ బ్యాంకింగ్, డిజిటల్ వాలెట్లకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తోందని స్పష్టం చేశారు.