ట్రంప్ కీలక నిర్ణయం.. రెండు వారాల కాల్పుల విరమణ
ఇరాన్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హర్మూజ్ జలసంధి సమస్యపై రెండు వారాల పాటు కాల్పుల విరమణ ప్రకటించారు. ఈ విషయాన్ని ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికలో వెల్లడించారు.
పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ అభ్యర్థన మేరకు ఇరాన్కు ఇచ్చిన గడువును రెండు వారాలు పొడిగిస్తూ, ఈ సమయంలో దాడులను నిలిపివేయాలని ట్రంప్ అంగీకరించినట్లు తెలిపారు. హర్మూజ్ జలసంధిని తెరవాలనే షరతుతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
ఇరాన్ నుంచి వచ్చిన పది సూత్రాల ప్రతిపాదన సానుకూలంగా ఉందని ట్రంప్ పేర్కొన్నారు. దీంతో ఇరుదేశాల మధ్య చర్చలు కీలక దశకు చేరుకున్నాయని, పశ్చిమాసియాలో శాశ్వత శాంతి సాధించడానికి ఈ రెండు వారాల గడువు ఉపయోగపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇక అమెరికా ప్రకటించిన రెండు వారాల కాల్పుల విరమణకు ఇరాన్ కూడా అంగీకరించింది. పాక్ ప్రధాని అభ్యర్థన మేరకు అమెరికాతో చర్చలకు సిద్ధమని తెలిపింది. సాయుధ దళాల పర్యవేక్షణలో రెండు వారాల పాటు హర్మూజ్ జలసంధిలో రాకపోకలు కొనసాగుతాయని ఇరాన్ వెల్లడించింది. అయితే ఇది కేవలం దౌత్య చర్చల కోసం ఇచ్చిన విరామమేనని, యుద్ధం పూర్తిగా ముగిసినట్లు కాదని స్పష్టం చేసింది.