హైదరాబాద్ బంజారాహిల్స్ ప్రాంతంలో కుళ్లిన బిర్యానీ విక్రయిస్తున్న ఘటన వెలుగులోకి రావడంతో నగరవాసులు షాక్కు గురయ్యారు. వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఒక రెస్టారెంట్పై పోలీసులు దాడులు నిర్వహించి సంచలన విషయాలను బయటపెట్టారు.
సమాచారం ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నెం.2లో ఉన్న ‘లక్కీ బిర్యానీ షవర్మాస్’ అనే హోటల్ నుంచి ఒక వ్యక్తి ఆన్లైన్ ఫుడ్ యాప్ ద్వారా చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశాడు. డెలివరీ వచ్చిన ప్యాకెట్ తెరిచిన వెంటనే బిర్యానీ నుంచి తీవ్ర దుర్వాసన రావడంతో పాటు అది పూర్తిగా కుళ్లిపోయినట్లు గుర్తించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఫిర్యాదు అందుకున్న పోలీసులు హోటల్పై ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. తనిఖీల్లో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. మూడు రోజుల క్రితం తయారు చేసిన బిర్యానీని ప్యాకెట్లుగా మార్చి ఫ్రిజ్లో నిల్వ చేసి, కస్టమర్లు ఆర్డర్ చేసినప్పుడు వాటిని మళ్లీ వేడి చేసి కొత్త బిర్యానీలా పంపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఇంకా హోటల్ పరిసరాలు పూర్తిగా అపరిశుభ్రంగా ఉండటం, ఆహార పదార్థాలు నిల్వ ఉంచిన ఫ్రిజ్లో ఎలుకలు తిరుగుతున్నట్లు కూడా అధికారులు గుర్తించారు. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్న ఈ ఘటనపై హోటల్ యజమాని ఇర్ఫాన్పై క్రిమినల్ కేసు నమోదు చేసి రెస్టారెంట్ను సీజ్ చేశారు.
ఈ ఘటనతో ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ చేసేటప్పుడు వినియోగదారులు మరింత జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు