తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారింది. భిన్న వాతావరణ పరిస్థితులు ఏపీ, తెలంగాణలో నెలకొన్నాయి. మొన్నటివరకు ఎండ తీవ్రత కొనసాగగా.. రెండ్రోజుల నుంచి వానల పడుతున్నాయి. పలు జిల్లాల్లో కురుస్తున్న చిరు జల్లులతో ఎండ ప్రభావం నుంచి ప్రజలకు చల్లని ఊరటనిచ్చాయి. భానుడి ప్రతాపం నుంచి కొంత ఉపశమనం లభించింది. కొన్ని జిల్లాల్లో స్వల్ప వర్షాలు కురుస్తుండగా.. మరికొన్ని జిల్లాల్లో ఎండలు కొనసాగుతున్నాయి. మంగళవారం తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో వర్షాలు కురవగా.. మార్చి 18న కూడా వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. కొన్ని జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు కూడా ఇచ్చింది. వాతావరణశాఖ అంచనాల ప్రకారం బుధవారం తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుందో చూద్దాం.
ఏపీలోని పలు జిల్లాలకు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. పోలవరం, అల్లూరి సీతారామరాజు, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఇక మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని అంచనా వేసింది. పిడుగులు పడే అవకాశం ఉన్న క్రమంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని సూచించింది. వర్షాల క్రమంలో వచ్చే నాలుగు రోజుల పాటు కోస్తా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని తెలిపింది. రెండు, మూడు డిగ్రీలు ఎండలు తగ్గుతాయని స్పష్టం చేసింది.