మార్కాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం – బస్సు, టిప్పర్ ఢీ… 13 మంది సజీవ దహనం
మార్కాపురం గ్రామీణం: మార్కాపురం జిల్లాలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాయవరం సమీపంలోని పలకల క్వారీల వద్ద టిప్పర్ లారీ – ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో భారీ ప్రమాదం చోటుచేసుకుంది.
ఈ ప్రమాదంలో బస్సుతో పాటు టిప్పర్లో కూడా మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకుని బస్సులో ప్రయాణిస్తున్న 13 మంది సజీవదహనమయ్యారు. మరో 15 మందికి తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం.
ప్రమాదంతో బస్సు, టిప్పర్ పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ బస్సు హరికృష్ణ ట్రావెల్స్కు చెందినదిగా అధికారులు గుర్తించారు. గురువారం ఉదయం 6 నుండి 6:30 గంటల మధ్య ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
ఘటనాస్థలికి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను మార్కాపురంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రమాదానికి కారణం ఏమిటి?
హైదరాబాద్ నుంచి పామూరు వైపు వెళ్తున్న బస్సు పలకల క్వారీల వద్ద మలుపు తిరుగుతుండగా టిప్పర్ అతివేగంగా వచ్చి ఢీకొట్టినట్లు సమాచారం. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 30 మంది ప్రయాణికులు ఉన్నారు.
బస్సు వెనుక భాగంలో ఉన్న ప్రయాణికులు బయటకు రాలేక మంటల్లో చిక్కుకుని మృతిచెందినట్లు తెలుస్తోంది. ముందు భాగంలో ఉన్నవారు ప్రాణాలతో బయటపడ్డారు.
మృతుల్లో కనిగిరి, పామూరు ప్రాంతాలకు చెందిన వారు ఉన్నట్లు సమాచారం. ఘటనాస్థలాన్ని మార్కాపురం జేసీ శ్రీనివాసులు, ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పరిశీలించారు.