తెలంగాణలో చికెన్ షాపులు బంద్? ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా షాపులు మూసివేత హెచ్చరిక
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా చికెన్ షాపులను ఏప్రిల్ 1వ తేదీ నుంచి బంద్ చేస్తామని రాష్ట్ర చికెన్ షాపుల ఓనర్స్ అసోసియేషన్ ప్రకటించింది. హైదరాబాద్లో జరిగిన సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు అసోసియేషన్ నాయకులు తెలిపారు.
ఎల్బీనగర్ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నెల్లుట్ల శేఖర్, ఉపాధ్యక్షుడు ఇందుర్తి కిరణ్కుమార్ మాట్లాడుతూ.. చికెన్ షాపులకు ఇచ్చే మార్జిన్ పెంచాలని పౌల్ట్రీ కంపెనీలను పలుమార్లు కోరినా ఎలాంటి స్పందన లేదని తెలిపారు.
గతంలో ఇచ్చిన మార్జిన్ను కూడా ప్రస్తుతం తగ్గించడంతో చిన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చికెన్ ధరలు భారీగా పెరిగినా వ్యాపారులకు ఎలాంటి లాభం లేకుండా పోతోందన్నారు.
కంపెనీలు మార్జిన్ పెంచే వరకు రాష్ట్రవ్యాప్తంగా చికెన్ షాపుల యజమానులు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొంటారని అసోసియేషన్ స్పష్టం చేసింది.
👉 ఏప్రిల్ 1 నుంచి చికెన్ దొరకకపోవచ్చా?
ఈ నిర్ణయం అమల్లోకి వస్తే తెలంగాణ వ్యాప్తంగా చికెన్ సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉంది. వినియోగదారులు కూడా ముందుగానే కొనుగోలు చేయాలని వ్యాపారులు సూచిస్తున్నారు.