- ఇది అందరి సమిష్టి కృషి ఫలితం
- కొత్త మేయర్ మమత, డిప్యూటీ మేయర్ సురేంద్ర రెడ్డి కిశుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
జడ్చర్ల, ఫిబ్రవరి 16,
మహబూబ్నగర్ కార్పొరేషన్ లో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను కాంగ్రెస్ కైవశం చేసుకోవడం పట్ల జడ్చర్ల ఎమ్మెల్యే, మహబూబ్నగర్ కార్పొరేషన్ ఎన్నికల ఇంచార్జి జనంపల్లి అనిరుధ్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ కార్పొరేషన్ ను కాంగ్రెస్ ఖాతాలో వేయడం ద్వారా సీఎం రేవంత్ రెడ్డికి కానుకగా ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు. మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కు ఈరోజు జరిగిన ఎన్నికలలో మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీకి చెందిన టి మమత మేయర్ గా, సురేందర్ రెడ్డి డిప్యూటీ మేయర్ గా ఎన్నిక కావడం పట్ల అనిరుధ్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మహబూబ్నగర్ మున్సిపల్ ఎన్నికలలో జడ్చర్ల నియోజకవర్గానికి చెందిన అనేకమంది నాయకులు, కార్యకర్తలు అన్ని డివిజన్ లలో ప్రచారం చేసి, మహబూబ్నగర్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారని, వారందరికీ తాను ధన్యవాదాలు తెలుపుతున్నానని అనిరుధ్ రెడ్డి చెప్పారు. కొత్తగా మేయర్, డిప్యూటీ మేయర్ గా ఎంపికైన మమత, సురేందర్ లను అనిరుధ్ రెడ్డి అభినందించారు. అదేవిధంగా ఈ ఎన్నికలలో పదవుల కోసం ఆశపెట్టుకొని పదవులు రాని కారణంగా నిరాశ చెందిన వారు ఎవరైనా ఉంటే, అలాంటి వారి గురించి అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని, అలాంటి వారికి కూడా భవిష్యత్తులో మంచి అవకాశాలను కల్పించేలా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో పని చేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని, ఈ విషయంలో ఎవరు నిరాశ చెందాల్సిన అవసరం లేదని అనిరుధ్ రెడ్డి పేర్కొన్నారు
Tags
mahabubnagar