యూట్యూబర్ అన్వేష్పై (YouTuber Anvesh) కేసు నమోదు అయ్యింది. దేవీ దేవతలను దూషించారంటూ అన్వేష్పై సినీనటి, బీజేపీ నాయకురాలు కరాటే కళ్యాణి పంజాగుట్ట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కళ్యాణి ఫిర్యాదు మేరకు అన్వేష్పై బీఎన్ఎస్ సెక్షన్ 352,79,299, ఐటీ చట్టంలోని 67 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. త్వరలో అన్వేష్కు పంజాగుట్ట పోలీసులు నోటీసులు జారీ చేయనున్నారు. అన్వేష్ వివాదాస్పద కామెంట్స్పై తెలంగాణలో వరుస ఫిర్యాదులు చేస్తున్నారు. మరోవైపు అన్వేష్ను దేశ ద్రోహిగా ప్రకటించాలని, అతడిని భారత్కు రప్పించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇటీవల హిందూ దేవతలపై యూట్యూబర్ అన్వేష్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. హీరోయిన్ల వస్త్రధారణపై నటుడు శివాజీ చేసిన కామెంట్స్ను తప్పుబడుతూ అన్వేష్ ఓ వీడియో చేశారు. అయితే ఆ వీడియోలో హిందూ దేవతలను కించపరిచే విధంగా మాట్లాడటం సంచలనంగా మారింది. హిందువులు దేవతగా కొలిచే సీతమ్మ వారిపై, అలాగే ద్రౌపది దేవి గురించి అన్వేష్ అసభ్యకరమైన రీతిలో మాట్లాడారు. దీంతో దేవతల పట్ల అన్వేష్ తీరుపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. యూట్యూబర్ కామెంట్స్కు నిరసనగా తెలుగు రాష్ట్రాల్లో అన్వేష్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
Tags
Telagana
