Gadwal Politics: గద్వాల్ లో కొత్త రాజకీయం..

 

Gadwal Politics: గద్వాల అంటే.. అందరికీ గుర్తొచ్చేది బంగ్లా రాజకీయం. పార్టీలు ఏవైనా.. లీడర్లు ఎవరైనా ఇంతకాలం అక్కడ శాసించింది బంగ్లా పాలిటిక్సే. కానీ ఇప్పుడు ఆ బంగ్లా రాజకీయానికి కాలం చెల్లిందన్న చర్చ మొదలయ్యింది. ఇకపై ఇంట్లో కూర్చుని చేసే రాజకీయాలు వర్కవుట్ కావని.. పబ్లిక్‌లో ఉండాల్సిందేనన్న టాక్ బలంగా వినిపిస్తోంది. ఇంతకీ గద్వాల్‌లో ఇంత మార్పు రావడానికి కారణం ఏంటి..? ఆ మార్పును తెచ్చిందెవరు..?

గద్వాలలో రాజ్యమేలిన బంగ్లా రాజకీయమే

తెలంగాణ రాజకీయాల్లో గద్వాల జిల్లా రాజకీయాలది ప్రత్యేక స్టైల్. అన్ని చోట్లా గడీల వ్యవహారం ఉంటే.. గద్వాలలో మాత్రం బంగ్లా రాజకీయమే ఇంతకాలం రాజ్యమేలింది. ఎవరు గెలిచినా, అధికారంలో ఉన్న పార్టీ నేతలు ఎవరైనా.. ఇంటినుంచే ఇంతకాలం రాజకీయాలు చేశారు. ఎమ్మెల్యేలను, లీడర్లను కలవాలంటే కార్యకర్తలు వాళ్ల ఇళ్లకు వెళ్లి పడిగాపులు కాయాల్సి వచ్చేది. పైగా గ్రూపులతో కాంగ్రెస్ పార్టీ సతమతమవుతోంది. ఓ వైపు బీఆర్‌ఎస్ నుంచి వచ్చి కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేసిన సరిత తిరుపతయ్య వర్గం, మరోవైపు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్‌లోకి వచ్చి, పార్టీలో ఉన్నారో లేదే తెలియని బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి వర్గం… ఎప్పటి నుంచో కాంగ్రెస్‌నే నమ్ముకుని ఉన్న కేడర్ ఇంకో వైపు.. మూడు ముక్కలాటగా మారిన గద్వాల రాజకీయాన్ని సెట్ చేయాలంటే యువనాయకత్వం ఉండాల్సిందేనని డిసైడ్ అయిన సీఎం రేవంత్‌రెడ్డి.. డీసీసీ బాధ్యతలను రాజీవ్‌రెడ్డికి అప్పగించారు. గద్వాల డీసీసీగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రాజీవ్‌రెడ్డి.. పార్టీ పనితీరును మార్చడంపైనే ప్రధానంగా దృష్టిపెట్టారు. ఇంతకాలం సాగిన బంగ్లా రాజకీయాలకు కాలం చెల్లిందని కొత్త తరహా రాజకీయం ఇకపై చూపిస్తానంటున్నారు డీసీసీ రాజీవ్ రెడ్డి. .

కాంగ్రెస్ పార్టీ ఆఫీసును ప్రారంభించడమే మొదటి పని

గద్వాలలో ఇంతకాలం కాంగ్రెస్ పార్టీకి ఆఫీసే లేదు. డీసీసీగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రాజీవ్‌రెడ్డి చేసిన మొదటి పని కాంగ్రెస్ పార్టీ ఆఫీసును ప్రారంభించడం. ఆ భవనానికి కూడా ప్రజా బంగ్లా అంటూ పేరు పెట్టారు. జిల్లాలోని కాంగ్రెస్ కార్యకర్తలు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా రావడానికి పార్టీ కార్యాలయం తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయంటున్నారు రాజీవ్‌రెడ్డి. ఏ కార్యక్రమమైనా ఇకపై పార్టీ ఆఫీస్ నుంచే జరగాలని ఆర్డర్ కూడా పాస్ చేశారట. అంతేకాదు ఈ మధ్య ప్రెస్‌మీట్‌లో ఆయన చేసిన ప్రకటన కూడా పార్టీలో కొత్త జోష్ నింపిందంటున్నారు..

సొంత నిర్ణయాలతో ముందుకు వెళితే వేటు

పార్టీలో కష్టపడుతున్నది ఒకరైతే, బంగ్లాలో కూర్చుని టికెట్లు తెచ్చుకునేది ఇంకొకరన్న అపవాదు ఇంతకాలం ఉండేది. ఇకపై దాన్ని మార్చుతానంటున్నారు రాజీవ్‌రెడ్డి. పార్టీ కోసం పనిచేసేవాళ్లకే బిఫామ్స్ ఇస్తామంటూ తేల్చి చెప్పేశారు. పార్టీని కాదని ఎవరైనా సొంత నిర్ణయాలతో ముందుకు వెళితే వేటు తప్పదని వార్నింగ్ ఇచ్చేశారు. ఇప్పటి వరకు ఒకలెక్క.. ఇకపై ఇంకో లెక్క.. అంటూ రాజీవ్‌రెడ్డి ఇచ్చిన వార్నింగ్‌తో బంగ్లా పాలిటిక్స్ చేసే వారిలో వణుకు మొదలయ్యిందంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లోనూ స్పీడ్‌ను పెంచారు రాజీవ్‌రెడ్డి. ఎక్కడికక్కడ జనంతో మమేకం అవుతూ తనదైన ముద్రను వేసే పనిలో ఉన్నారు.

పార్టీ మరింత బలంగా తయారవుతుందన్న చర్చ

రాజీవ్‌రెడ్డి .. ప్రస్తుతం చూపిస్తున్న దూకుడును కంటిన్యూ చేస్తే మాత్రం, గద్వాలలో కాంగ్రెస్ మరింత బలంగా తయారవుతుందన్న చర్చ కేడర్‌లో జరుగుతోంది. ఇన్నాళ్లకైనా నిజమైన కార్యకర్తలకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం కనిపిస్తోంది.
Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow