Goa: గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్‌ పేలి 23 మంది మృతి


 గోవాలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తర గోవాలోని అర్పోరా గ్రామంలో ఉన్న ‘బర్చ్‌ బై రోమియో లేన్‌’ నైట్‌ క్లబ్‌లో శనివారం అర్ధరాత్రి సిలిండర్‌ పేలి 23 మంది మృతి చెందారు. మృతుల్లో నలుగురు వరకు పర్యటకులు ఉన్నట్లు సీఎం ప్రమోద్‌ కుమార్‌ సావంత్‌ తెలిపారు. మిగతావారంతా క్లబ్‌ సిబ్బందిగా గుర్తించారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నట్లు, వారంతా కిచెన్‌ సిబ్బంది అని అధికారులు తెలిపారు. మృతుల్లో ముగ్గురు సజీవదహనమవగా, 20 మంది ఊపిరాడక చనిపోయారని పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన నైట్‌క్లబ్‌ రాజధాని పనాజీకి 25 కి.మీ దూరంలో ఉంది. గతేడాది దీన్ని ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.  

సిలిండర్‌ పేలుడు సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది, అత్యవసర బృందాలు ప్రమాదం చోటుచేసుకున్న ప్రాంతానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాయి. స్థానిక ఎమ్మెల్యే మైఖేల్‌ లోబోతో కలిసి సీఎం ప్రమోద్‌ కుమార్‌ ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదంపై వివరణాత్మక దర్యాప్తు నిర్వహిస్తామని సీఎం ప్రకటించారు. ప్రమాదం జరిగిన నైట్‌ క్లబ్‌లో భద్రతా చర్యలు పాటించలేదని తమకు తెలిసినట్లు చెప్పారు. విచారణలో భద్రతా ప్రమాణాలు పాటించనట్లు తేలితే నిందితులపై కఠిన చర్యలు తీసుకోనున్నామన్నారు. అంతేకాకుండా ఈ క్లబ్‌ నడిచేందుకు అనుమతిచ్చిన అధికారులపై సైతం చర్యలు తీసుకుంటామని సీఎం చెప్పారు. ప్రమాదంపై సీఎం ప్రమోద్‌ సావంత్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది దురదృష్ట ఘటనగా పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. మృతదేహాలను స్వాధీనం చేసుకొని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎమ్మెల్యే లోబో పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో ఉన్న అన్ని నైట్‌ క్లబ్‌లపై తనిఖీలు నిర్వహిస్తామన్నారు. అనుమతులు లేని క్లబ్‌ లైసెన్స్‌లు రద్దుచేస్తామని ఎమ్మెల్యే చెప్పారు.   

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow