పాలక రాజకీయ క్రీడలకు పాలమూరు ఎంత కాలం బలి కావాలి? మాజీ, ప్రస్తుత ముఖ్యమంత్రులకు పాలమూరు అధ్యయన వేదిక వేస్తున్న సూటి ప్రశ్న ఇది. చాలా కాలం తరువాత బీఆర్ఎస్ అధ్యక్షుడు తమ పార్టీ ఆఫీసుకు వస్తే తెలంగాణకు అది ప్రముఖ వార్త అయిపోయింది. ఆయన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు. ఆయన డిసెంబర్ 21న తెలంగాణ భవన్లో ప్రెస్ మీటింగ్ జరిపారు. నిన్ననే కేసీఆర్ ప్రెస్ మీటింగ్కి ప్రతి స్పందనగా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులతో ముచ్చట జరిపారు.
తొమ్మిది సంవత్సరాల పాలనలో ఏమి పనులు చేయవలసి ఉండినదో, ప్రజలు ఎందుకు తెలంగాణ రాష్ట్రం సాదించుకున్నారో పట్టకుండా మాజీ ముఖ్యమంత్రి అనేక ప్రశ్నలు అడిగారు. అలాగే ఈ రెండేళ్లుగా పాలిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ తప్పులను ప్రశ్నించారు. ఇద్దరి మీడియా సంభాషణలను అలా ఉంచి చూస్తే దీని వల్ల మహబూబ్నగర్ జిల్లా తీవ్రంగా నష్టపోయింది. జిల్లాకు గత ఏడు దశాబ్దాలుగా జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడం అత్యవసరంగా గుర్తించి చర్యలు తీసుకోవాలి.
ఎనిమిదేండ్లు గడిచినా ప్రాజెక్టు పెండింగే...
2014 జూన్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిన తరువాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ పథకం లక్ష్యాలను దారి మళ్లించి దిగువన శ్రీశైలం ప్రాజెక్టు లోకి మార్చి 2015 జూన్ 11న శంకుస్థాపన చేశారు. మూడేళ్ల కాలంలో పూర్తి చేయడానికి అవకాశం ఉన్న ప్రాజెక్టును ఎనిమిది ఏండ్లు గడిచినా పూర్తి చేయలేదు. ఇంతే కాక 2015 జూన్ 12న నల్లగొండ జిల్లాలో దిండి లిఫ్ట్ పనులకు శంకుస్థాపన చేశారు. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ పథకం లాంటి ఒక ప్రతిపాదన లేకుండా, దానిపై ఒక చర్చ లేకుండా కేసీఆర్ ఎందుకు శంకుస్థాపన చేశారో ప్రజలకు సంజాయిషీ ఇవ్వాలి. ఈ తప్పుడు పథకాన్ని తీసుకొచ్చి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ పథకానికి జోడించి తీరని నష్టం చేశాడు. దిండి లిఫ్ట్లో రిజర్వాయర్లు, కాలువల పనులను వేగవంతం చేశారు. ఎందుకు పాలమూరు లిఫ్ట్కు అన్యాయం చేశారో ఒక్కసారి కూడా నిజం చెప్పలేదు.
పాలమూరుపై విచారణ ఏది?
ఇక ప్రస్తుత ముఖ్యమంత్రి కూడా పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ పథకాన్ని సీరియస్గా పట్టించుకోవడం లేదు. కాళేశ్వరం లిఫ్ట్ పనులతోపాటు పాలమూరు పనుల మీద ఎందుకు విచారణ జరపలేదు? మహబూబ్ నగర్ జిల్లాకు నష్టం చేసే విధంగా ఆవే పనులు ఎందుకు కొనసాగిస్తున్నారు. లక్ష్మీదేవిపల్లి పనులు వదిలేసి దిండి లిఫ్ట్ పనులు ఎందుకు చేస్తున్నారో ప్రజలకు చెప్పాలి కదా. దిండి లిఫ్ట్ పనులు చేస్తుంటే గ్రామాలు ముంపునకు గురవుతున్నాయని మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు ఉద్యమాలు చేస్తున్నారు. దిండి లిఫ్ట్ను నాగార్జున సాగర్ నుంచి నీటిని తీసుకునే విధంగా చేపట్టి ఉంటే ఇప్పుడు దిండి లిఫ్ట్ పేరుతో వేలాది ఎకరాల పేద రైతుల భూములు, గ్రామాలను ముంపు బారి నుండి కాపాడేందుకు అవకాశం ఉండేది.





