హైదరాబాద్: అరెస్టైన ఉగ్రవాది డాక్టర్ మొయినుద్దీన్ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గుజరాత్ ఏటీఎస్ బృందం రాజేంద్రనగర్ ప్రాంతంలో సయ్యద్ మొయినుద్దీన్ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. విచారణలో కీలక సమాచారం బయటకు వచ్చినట్టు తెలుస్తోంది.
సమాచారం ప్రకారం, మొయినుద్దీన్ భారీ స్థాయిలో విషప్రయోగం చేసి చంపాలని కుట్ర పన్నినట్లు వెల్లడైంది. అతను రెసిన్ అనే ప్రాణాంతక రసాయనాన్ని తయారు చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. ఈ విషాన్ని దేవాలయాల నీటి ట్యాంకుల్లో, పబ్లిక్ వాటర్ ట్యాంక్లో కలిపి పెద్ద ఎత్తున ప్రజలను చంపాలని కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. మొయినుద్దీన్ నుంచి రెసిన్ తయారీలో ఉపయోగించే పలు రసాయన పదార్థాలను గుజరాత్ ఏటీఎస్ స్వాధీనం చేసుకుంది. మొయినుద్దీన్ పాకిస్తాన్ నుంచి వచ్చిన హ్యాండ్లర్ ఆదేశాల మేరకు ఈ విషాన్ని తయారు చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. దానికి సంబంధించిన డిజిటల్ ఆధారాలు కూడా లభించినట్టు అధికారులు తెలిపారు. సయ్యద్ మొయినుద్దీన్ చైనాలో MBBS పూర్తి చేసి హైదరాబాద్కు తిరిగి వచ్చి, ఆన్లైన్ ట్రీట్మెంట్ పేరుతో వైద్య సేవలు అందిస్తున్నాడు. అతనితో పాటు గుజరాత్ ఏటీఎస్ నలుగురిని అరెస్ట్ చేసింది. మోయినుద్దీన్ నుండి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ప్రత్యేక బృందం విచారణ జరుపుతోంది.