రోడ్లపై ధాన్యం మారపోసి ఆర బెట్టడం వలన వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారని జిల్లా ఎస్పీ జానకి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో అనేక రహదారులు వ్యవసాయ క్షేత్రాలకు ఆనుకొని ఉన్నందున రైతులు రోడ్లపైనే ధాన్యం మారపోసి ఆరబెడుతున్నారని, ఇది రోడ్డు ప్రమాదాలకు కారణం అవుతున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాక నల్లని కవర్లు కప్పి, వాటిపై రాళ్ళను ఉంచడం వలన రాత్రుళ్ళు వాహనదారులు వాటిని గుర్తించలేక, భారీ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, ఇది ప్రాణాలకు ముప్పు తెస్తుందన్నారు. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ గ్రామాల వారీగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ రైతులకు సూచనలు అందజేస్తుందని అందుకు సహకరించాలని ఆమె కోరారు. ఒకవేళ రోడ్లపై ధాన్యం ఆరబెట్టడం ద్వారా జరిగే ప్రమాదాలకు రైతులనే భాద్యుణ్ణి చేస్తామని హెచ్చరించారు. దయచేసి రైతులు రోడ్లపై ధాన్యం ఆరబెట్టకుండా, గ్రామాలను, ఖాళీ ప్రదేశాలను వినియోగించుకోవాలని సూచించారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల తగ్గింపుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, ప్రజల భద్రత అందరి బాధ్యత అని ఎస్పీ జానకి పేర్కొన్నారు.
Tags
mahabubnagar