నేటికాలంలో వాట్సప్ గురించి తెలియని వారంటూ ఉండరు. ప్రతి ఒక్కరి సెల్ ఫోన్ లో ఈ ఫీచర్ తప్పనిసరి గా ఉంటుంది. ఇక కొందరు అయితే తెల్లవారింది మొదలు పడుకునే వరకు వాట్సాప్ చాట్ లో మునిగి తేలుతుంటారు. అయితే ఇటీవల విదేశీ వస్తువులను, ఫీచర్లను వాడవద్దు అనే నినాదం పెరిగింది. ఈ క్రమంలోనే వాట్సప్కు పోటీగా స్వదేశీ మెసేజింగ్ యాప్ ‘అరట్టై’ వచ్చింది. ప్రస్తుతం దీని పేరు నెట్టింట మార్మోగుతోంది. తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులోనూ అరట్టై గురించి ప్రస్తావన వచ్చింది. మరి..ఏ సందర్బంలో వచ్చింది, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
వాట్సప్ అకౌంట్ పునరుద్ధరణకు సంబంధించి సుప్రీంకోర్టు(Supreme Court)లో ఓ పిటిషన్ దాఖలైంది. దానిపై శనివారం సుప్రీం కోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. వాట్సప్ (WhatsApp) లేకపోతే ఏం.. అరట్టై వాడొచ్చు కదా అని సూచించింది. తన ఖాతాను వాట్సప్ బ్లాక్ చేసిందని, దాన్ని పునరుద్ధరించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ సుప్రీంకోర్టు(Supreme Court)లో ఓ వ్యక్తి రిట్ పిటిషన్ దాఖలు చేశాడు. సోషల్ మీడియాలో ఉన్నట్టుండి ఇలా అకౌంట్లను నిషేధించకుండా ఉండేలా మార్గదర్శకాలు జారీ చేయాలని పిటిషనర్ సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని కోరాడు. దీనిపై న్యాయస్థానం కూడా ఒకింత అసహనం వ్యక్తంచేసింది. వాట్సప్ యాక్సెస్ ఉండటం ప్రాథమిక హక్కు ఎలా అవుతుంది? అని ప్రశ్నించింది.
పిటిషనర్ ఓ డయాగ్నిక్ సెంటర్లో పనిచేస్తున్నాడని, వాట్సప్లోనే తన క్లయింట్లతో టచ్లో ఉన్నారని, ఉన్నట్టుండి ఆ ఖాతాను బ్లాక్ చేశారని పిటిషనర్ తరఫు న్యాయవాది బదులిచ్చాడు. దీనిపై ధర్మాసనం(Supreme Court) స్పందిస్తూ.. కమ్యూనికేషన్ కోసం ఇతర యాప్లు కూడా ఉన్నాయని, వాటిని ఉపయోగించొచ్చు కదా..! అని ప్రశ్నించింది. ఈ మధ్యే స్వదేశీ యాప్ ‘అరట్టై’(Arattai) కూడా వచ్చింది. దాన్ని వాడుకోండని సూచించింది. దీనిపై ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరిస్తూ పిటిషన్ను కొట్టేసింది. సుప్రీం కోర్టు(Supreme Court) చేసిన వ్యాఖ్యలకు కంగుతిన్న పిటిషనర్.. కోర్టు అనుమతితో తన వ్యాజ్యాన్ని ఉపసంహరించుకున్నాడు.