ప్రియుడి కోసం కన్నబిడ్డను నల్గొండ బస్స్టాండ్లో వదిలేసి వెళ్లిన తల్లిని ఇప్పుడు అందరూ తిట్టిపోస్తున్నారు. . ఇన్స్టా పరిచయంతో మాయలో పడిన ఆమె.. 15 నెలల బాబును అనాధలా వదిలేసి, ప్రియుడితో జంప్ అయ్యింది. సీసీ కెమెరా ఆధారంగా గుర్తించిన పోలీసులు చివరకు బాలుడిని తండ్రికి అప్పగించారు.
వివాహ బంధానికి రోజురోజుకు బీటలు వారుతున్నాయి. మద పిచ్చితో మాతృత్వానికి మచ్చ తెస్తున్నారు కొందరు. ఇంత ఘాటైన పదం వాడినందుకు క్షమించండి.. కానీ పరిస్థితులు అలానే దిగజారిపోతున్నాయి. రోజుకో వరస్ట్ వార్త వినాల్సి వస్తుంది. ప్రియుడు తనవెంట రమ్మని చెప్పడంతో కన్నబిడ్డను దిక్కు లేని అనాధగా నల్గొండ బస్స్టాండ్లో వదిలేసి వెళ్ళింది ఓ మానవత్వం లేని తల్లి.. అమ్మ ఎక్కడికి వెళ్ళిందో తెలియక.. బిక్కుబిక్కుమంటూ ఏడుస్తున్న 15 నెలల చిన్నోడిని గమనించిన ఆర్టీసీ సిబ్బంది పోలీసులకు సమాచారమివ్వడంతో.. వారు వచ్చి సీసీ కెమెరాల ఆధారంగా ముందు తల్లి ఆనవాలు గుర్తించారు. ఆమె భర్తను పిలిపించి.. బిడ్డను ఆయనకు అప్పగించారు. ఈ దారుణమైన ఘటన నల్గొండ బస్ స్టాండ్లో చోటు చేసుకుంది.
