మూడేళ్ల తర్వాత రూ.5 లక్షలు చేస్తారా..
ఇష్టానుసారంగా పెంచుతామంటే ఎలా..
కొన్ని కాలేజీల తీరుపై అధికారుల అసంతృప్తి.
ఇంజనీరింగ్ ఫీజుల పెంపు నిర్ణయం వాయిదా.
ఇప్పుడు రూ.1.5 లక్షలుగా ఉన్న ఫీజును.. రూ.2.5 లక్షలకు పెంచాలంటున్నారు. ఇలా ఇష్టానుసారంగా పెంచుకుంటూ పోతే.. మూడేళ్ల తర్వాత రూ. 5లక్షలు కావాలంటారా.. అని ఇంజనీరింగ్ కాలేజీలపై ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ ప్రశ్నించింది. ఫీజుల ఖరారుకు సంబంధించిన కీలక సమావేశం మంగళవారం సచివాలయంలో జరిగింది. మూడేళ్లకోసారి ఫీజులు పెంచాల్సి ఉండగా.. ఇప్పటికే కాలేజీలు సమర్పించిన ఆడిటర్ నివేదికల ఆధారంగా ఫీజు నియంత్రణ కమిటీ(ఎఫ్ఆర్సీ) ఫీజులను సిద్ధం చేసింది. దీనిపై విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితారాణా, సాంకేతిక విద్య కమిషనర్ శ్రీదేవసేన, ఉన్నత విద్యామండలి అధ్యక్షుడు ఆచార్య బాలకిష్టారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు సమీక్షించారు. నగర శివార్లలోని కొన్ని కాలేజీలు ప్రతిపాదించిన ఫీజులపై అధికారులు ఆశ్చర్యం వ్యక్తంచేశారు. మూడేళ్లలో ఒక సీటుకు రూ.లక్ష పెంచాలంటున్నారు. దీనికి ప్రాతిపదికత ఏమిటి.. ఖర్చులు పెరిగాయని, ఆడిటర్ నివేదికలు ఇస్తే పెంచేయాలా.. అని ప్రశ్నించారు.
చాలా కాలేజీల్లో సీట్లు 1,500కి పైగానే ఉన్నాయి. ఈ లెక్కన 1,600 సీట్లున్న ఓ కాలేజీ ఇప్పుడు ఏడాదికి రూ.24 కోట్లు వసూలు చేస్తుండగా.. ఫీజులు పెంచితే రూ.40కోట్లు వస్తాయని అధికారులు పేర్కొన్నారు. దీంతో విద్యార్థులతోపాటు ఫీజు రియింబర్స్మెంటు చెల్లించే ప్రభుత్వ ఖజానాపైనా తీవ్ర ప్రభావం ఉంటుందని యోగితారాణా, శ్రీదేవసేన అన్నట్లు తెలిసింది. కొన్ని ప్రముఖ కాలేజీలు ఏకంగా రూ. 2లక్షలకు ఫీజులను పెంచాలని ప్రతిపాదించడంపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. ఎఫ్ఆర్సీ సిఫారసులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించలేమని స్పష్టం చేశారు. ప్రస్తుత ఫీజులతో పోలిస్తే.. 30శాతానికి మించి పెంచేది లేదన్నారు. ఎఫ్ఆర్సీ ప్రతిపాదిత ఫీజులను సవరించాలని, కొత్త జాబితా సిద్ధమైతే మళ్లీ సమావేశం నిర్వహించి, ఖరారు చేస్తామని యోగితారాణా పేర్కొన్నారు.
ఇంజనీరింగ్ ఫీజులను రూ.2.5 లక్షల వరకు పెంచాలని కొన్ని కాలేజీలు ప్రతిపాదించడంతో అధికారుల అభ్యంతరం. వాయిదా వేసిన ఫీజుల పెంపు నిర్ణయం తదుపరి సమీక్షకు.
Tags
Telangana