- దక్షిణ తెలంగాణా అభివృద్ధి లో భాగంగా మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డి
- చిట్ట బోయిన పల్లి సమీపంలో ఏర్పాటు కానున్న ట్రిపుల్ ఐటీ
- మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సహకారం తో ఫలించిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ప్రయత్నం
- సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
జడ్చర్ల, మే 28: జడ్చర్ల మండలం లోని చిట్ట బోయిన పల్లి సమీపంలో మహబూబ్ నగర్- జడ్చర్ల శివారు లో కొత్త ట్రిపుల్ ఐటీ నీ మంజూరు చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసిందని జడ్చర్ల ఎమ్మెల్యే జనం పల్లి అనిరుధ్ రెడ్డి వెల్లడించారు.
మహబూబ్ నగర్ జిల్లాకు మంజూరైన ఈ ఐఐఐటితో జడ్చర్ల రూపురేఖలు మారనున్నాయని చెప్పారు.ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రాంతాల్లో జడ్చర్ల ముందుండగా నూతనంగా మంజూరైన ఐఐఐటి ద్వారా ఈ ప్రాంతం మరింతగా అభివృద్ధి చెందనుందని తెలిపారు. దీనికి సంబంధించిన జివో నంబర్ 24 ను ప్రభుత్వం బుధవారం విడుదల చేసిందన్నారు. జిల్లాకు మంజూరైన ఐఐఐటి కి జడ్చర్ల మండలం చిట్టబోయినపల్లి సర్వే నంబర్ 1/1 లో 21.26 ఎకరాలు, మహబూబ్ నగర్ మండలం ఎదిర శివారు సర్వే నంబర్ 423/1,423/18,425/1 లో 20.06 ఎకరాలు కేటాయించడం జరిగిం దని తెలిపారు. ప్రస్తుతం ట్రిపుల్ ఐటీ కి కేటాయించిన భూమి 44వ నెంబరు జాతీయరహదారికి సమీపంలో ఉండటంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రాంతం త్వరితగతిన అభివృద్ది చెందే అస్కారం కలుగుతుందని అనిరుధ్ రెడ్డి పేర్కొన్నారు.ఐఐఐటి జడ్చర్ల, మహబూబ్ నగర్ శివార్లలో ఏర్పాటు చేసేందుకు స్థానిక ఎమ్మెల్యే గా తాను చేసిన ప్రయత్నానికి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి కూడా సహకరించారని చెప్పారు. వారి సహకారం తో సీఎం రేవంత్ రెడ్డి జడ్చర్ల కు ట్రిపుల్ ఐటీ ఇచ్చారని వివరించారు. గత బి ఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో దక్షిణ తెలంగాణా ప్రాంతానికి ప్రాధాన్యత లేకపోగా సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రాంత అభివృద్ధి లో భాగంగా జడ్చర్ల కు ట్రిపుల్ ఐటీ కేటాయించారని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఆయన సీఎం రేవంత్ రెడ్డి కి, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాసరెడ్డి, మధుసూధన్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు. వాస్తవానికి గత ప్రభుత్వ హయాంలో జిల్లాకు మంజూరైన మెడికల్ కళాశాల, జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో ఏదో ఒకటి ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయాల్సి ఉండగా బి ఆర్ ఎస్ ప్రభుత్వం వాటిని ఒక ప్రాంతానికే పరిమితం చేసిందని అనిరుధ్ రెడ్డి విమర్శించారు.