Hyderabad: మహానగరంలోని ఆ మాయ లేడీలు ముసలి వాళ్లకు పెళ్లిళ్లు చేస్తామంటూ ప్రచారం చేశారు. సంపన్నులు, రిటైర్మెంట్ తీసుకున్న ఉద్యోగులను టార్గెట్ చేసుకుని తమ ప్లాన్ అమలు చేశారు. ఓ వృద్ధుడు వీరి ఉచ్చులో చిక్కుకున్నాడు.
పెళ్లిళ్ల పేరుతో మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మోసగాళ్లు ఆఖరికి వృద్ధులను కూడా వదలటం లేదు. రెండో పెళ్లి చేస్తామంటూ నమ్మించి, మోసం చేస్తున్నారు. వృద్ధులను టార్గెట్ చేసి మోసాలకు పాల్పడుతున్న మాయ లేడీల గుట్టు రట్టయింది. ఓ ఇద్దరు మహిళలు వృద్ధులకు పెళ్లి చేస్తామంటూ మోసాలకు పాల్పడుతున్నారు. వారి కారణంగా మోస పోయిన ఓ వృద్ధుడు పోలీస్ స్టేషన్కు వెళ్లటంతో విషయం వెలుగులోకి వచ్చింది. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్కు చెందిన ఓ ఇద్దరు మహిళలు ఓ ఫేక్ మ్యారేజ్ బ్యూరోను ఏర్పాటు చేశారు. ముసలి వాళ్లకు పెళ్లిళ్లు చేస్తామంటూ ప్రచారం చేశారు. సంపన్నులు, రిటైర్మెంట్ తీసుకున్న ఉద్యోగులను టార్గెట్ చేసుకుని తమ ప్లాన్ అమలు చేశారు. ఓ వృద్ధుడు వీరి ఉచ్చులో చిక్కుకున్నాడు. అతడికి గుర్తు తెలియని మహిళతో పెళ్లి నిశ్చయం చేశారు. పెళ్లి షాపింగ్ పేరుతో రెండు లక్షల రూపాయలు కాజేశారు.
పెళ్లి రోజు రానే వచ్చింది. ఆ వృద్ధుడు పెళ్లి బట్టలతో .. ఆ మహిళల పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ముహూర్త సమయం దాటిపోయి గంటలు గడిచినా ఎవ్వరూ రాలేదు. దీంతో మోసపోయానని భావించిన ఆ పెద్దాయన మహాంకాళి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ ఇద్దరు కిలేడీ లేడీస్ కోసం గాలిస్తున్నారు.