Ponguleti Srinivas Reddy: బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన విమర్శలపై మంత్రులు ఎదురుదాడికి దిగారు.
కేసీఆర్ విమర్శలకు ఘాటుగా బదులిచ్చారు. గుడ్డ కాల్చి మీద వేస్తున్నారు అంటూ కేసీఆర్ పై విరుచుకుపడ్డారు మంత్రులు. కేసీఆర్ తన కడుపులో విషం పెట్టుకున్నారని మంత్రులు ధ్వజమెత్తారు. అధికారంలోకి వస్తామని కేసీఆర్ పగటి కలలు కంటున్నారని మండిపడ్డారు. కేసీఆర్ సభకి ఇబ్బందులు పెట్టామని చెప్పడం పచ్చి అబద్ధమన్నారు. రాహుల్ గాంధీ ఖమ్మం సభకు వస్తే ఎన్ని ఇబ్బందులు పెట్టారో గుర్తు లేదా? అని నిలదీశారు. మేము ఇబ్బంది పెడితే సభ పెట్టుకునే వారా? అని కేసీఆర్ ను నిలదీశారు మంత్రులు.
1500 కోట్ల డబ్బు బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడిది? ఏ వ్యాపారం వల్ల కేసీఆర్ కుటుంబానికి ఇన్ని కోట్లు వచ్చాయి? సోనియా వల్లే తెలంగాణ వచ్చిందన్న కేసీఆర్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని తిడుతున్నారు. మా ప్రభుత్వం వచ్చే నాటికి సర్పంచులే లేరు. వాళ్ళకి మేం ఎక్కడ పెండింగ్ ఉన్నాం? పెండింగ్ బిల్లులన్నీ బీఆర్ఎస్ హయాంలోనివే. జాతీయ పార్టీగా వాళ్ళకి వాళ్ళే సర్టిఫికెట్ ఇచ్చుకున్నారు” అని కేసీఆర్ పై ధ్వజమెత్తారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.
కాంగ్రెస్ సర్కార్ అన్నింటిలో ఫెయిల్..ఫెయిల్..ఫెయిల్..- కేసీఆర్
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కాంగ్రెస్ సర్కార్ పై నిప్పులు చెరిగారు కేసీఆర్. కాంగ్రెస్ సర్కార్ అన్నింటిలో ఫెయిల్ అయ్యిందన్నారు. సంక్షేమంలో ఫెయిల్, పొలాలకు నీళ్లు ఇవ్వడంలో ఫెయిల్, మంచి నీళ్లు ఇవ్వడంలో ఫెయిల్, కరెంటు సరఫరాలో ఫెయిల్, రైతుబంధు ఇవ్వడంలో ఫెయిల్, పల్లెలు పట్టణాల్లో ఫెయిల్, విత్తనాలు-ఎరువుల సరఫరాల్లో ఫెయిల్, భూముల ధరలు పెంచడంలో ఫెయిల్ అంటూ విరుచుకుపడ్డారు కేసీఆర్.
మరి కాంగ్రెస్ సర్కార్ ఎందులో పాస్ అయిందంటే.. ఎట్లపడితే అట్ల ఒర్లుడులో పాస్. దేవుళ్లపై ఒట్టు పెట్టడం, అబద్ధపు వాగ్దానాలు చేసుడు, కమీషన్లు తీసుకోవడంలో పాస్. సంచులు నింపుడు, మోసుడులో పాస్” అని విరుచుకుపడ్డారు కేసీఆర్.