హైదరాబాద్: మాజీ మంత్రి హరీష్రావుపై (Harish Rao) తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (Adi Srinivas) ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇవాళ(సోమవారం) సీఎల్పీ మీడియా పాయింట్లో ఆది శ్రీనివాస్ మాట్లాడారు. హరీష్రావు కాంగ్రెస్లోకి రావడానికి గతంలో ప్రయత్నం చేశారని గుర్తుచేశారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికి ఉంటే హరీష్రావు ఇప్పటికి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేవారని తెలిపారు. హరీష్రావు కాంగ్రెస్లోకి వచ్చే విషయంపై ఏమైనా ఉంటే అధిష్ఠానం చూసుకుంటుందని అన్నారు. బీఆర్ఎస్లో హరీష్రావు ప్రాముఖ్యం తగ్గిపోయిందని ఆది శ్రీనివాస్ తెలిపారు. బీఆర్ఎస్లో కూర్చీ పంచాయతీ..
మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబంపై ఆది శ్రీనివాస్ షాకింగ్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్లో కుటుంబ కలహాలు ఉన్నాయని.. తాము ఎప్పటి నుంచో చెబుతున్నామని అన్నారు. హరీష్రావును సోషల్ మీడియాలో కేటీఆర్ ఆన్ ఫాలో చేశారని తెలిపారు. ఆ పార్టీలో గ్రూప్ తగాదాలు తారాస్థాయికి చేరాయని ఆరోపించారు. బీఆర్ఎస్లో కూర్చీ పంచాయితీ నడుస్తోందని విమర్శించారు. ఒక వైపు కవిత, మరో వైపు కేటీఆర్, ఇంకోక వైపు హరీష్రావు ఇలా గ్రూప్ తగాదా నడుస్తుందని ఆది శ్రీనివాస్ అన్నారు. సీ కులగణన కాంగ్రెస్ పేటెంట్..
బీసీ కులగణన కాంగ్రెస్ పేటెంట్ అని ఆది శ్రీనివాస్ ఉద్ఘాటించారు. గతంలో ప్రతీ పేద వాడికి ఏది కావాలో గుర్తించి కాంగ్రెస్ అందించిందని తెలిపారు. కులగణనపై ఎన్నో ఏళ్లుగా డిమాండ్ ఉందని.. దానిని తమ ప్రభుత్వం పూర్తి చేసిందని అన్నారు. కుల గణనపై బీజేపీ ఏనాడూ నోరు విప్పలేదని చెప్పారు. తాము కులగణన చేసిన తర్వాత బీజేపీ దిగి వచ్చిందని అన్నారు. బడుగు, బలహీన వర్గాలు కాంగ్రెస్ వైపు చూస్తుండటంతో బీజేపీ కుయుక్తులు చేస్తోందని విమర్శలు చేశారు. తెలంగాణలో కులగణన కాదు, సర్వే చేశారని కేంద్రమంత్రి కిషన్రెడ్డి అంటున్నారని అన్నారు. ఈ రెండింటికి తేడా ఏంటని ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు.
రేపు బీజేపీ ప్రభుత్వం చేసేది కూడా ఇదే కదా.. కులగణన చేసేది ఈ అధికారులే కదా అని ఆది శ్రీనివాస్ నిలదీశారు. సర్వే, కుల గణన చేసినా కులం మారదు కదా అని ప్రశ్నించారు. బీసీల పట్ల బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే వెంటనే కులగణన ప్రారంభించి కట్ ఆఫ్ డేట్ పెట్టి పూర్తి చేసి రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేశారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాంధీ చేసిన డిమాండ్కు కేంద్ర ప్రభుత్వం తలొగ్గిందని చెప్పారు. ఈ రోజు దేశవ్యాప్తంగా బీసీలు ఒక్కటవుతున్నారని అన్నారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరిగిన బీసీ ధర్నాకు 17 రాజకీయ పార్టీలు హాజరైతే.. బీజేపీ, బీఆర్ఎస్లు దూరంగా ఉన్నాయని మండిపడ్డారు. బీసీల పట్ల ఈ రెండు పార్టీల చిత్తశుద్ధి ఏంటో తెలుస్తోందని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.