ఎవరూ లేని ఓ ప్రదేశంలో డబ్బుల కట్టలతో ఉన్న ఓ బ్యాగ్ కనిపిస్తే ఎవరైనా ఏం చేస్తారు? చడీ చప్పుడు లేకుండా దాన్ని తీసి ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడతారు. కానీ ఇక్కడో కండక్టర్ మాత్రం దీనికి భిన్నంగా పూర్తి నిజాయితీతో వ్యవహరించింది.

ప్రజా రవాణా సంస్థలో విధులు నిర్వహిస్తూ నిజాయితీ, బాధ్యతకు మారుపేరుగా నిలిచింది షాద్‌నగర్ ఆర్టీసీ డిపో కండక్టర్ సరిత. హజ్ యాత్రకు వెళ్లేందుకు షాద్‌నగర్‌కు చెందిన వ్యాపారి జహంగీర్ తన భార్యతో కలిసి బస్సులో హైదరాబాద్‌కు బయలుదేరారు.

అయితే అఫ్జల్‌గంజ్ వద్ద బస్సు దిగిన అనంతరం నాంపల్లికి వెళ్లిపోయిన జహంగీర్, పొరపాటున రూ.3 లక్షల నగదు ఉన్న బ్యాగును బస్సులోనే మర్చిపోయారు. బస్సులో నగదు బ్యాగును గుర్తించిన కండక్టర్ సరిత, వెంటనే డ్రైవర్ నరసింహులుకు సమాచారం అందించి, నగదును భద్రపరిచారు.

బ్యాగు బస్సులోనే మిగిలిపోయిన విషయం గుర్తించిన జహంగీర్ వెంటనే ప్రైవేట్ వాహనంలో బస్టాండ్‌కు చేరుకున్నారు. దీంతో అతన్ని గుర్తించిన కండక్టర్ సరిత మరియు డ్రైవర్ నరసింహులు, తను బస్సులో మర్చిపోయిన రూ.3 లక్షల నగదు ఉన్న బ్యాగ్‌ను సురక్షితంగా తిరిగి అప్పగించారు. దీంతో బాధితుడు ఊపిరిపీల్చుకున్నాడు.

💰
తిరిగి ఇచ్చిన నగదు
👩‍✈️
నిజాయితీ కనబరిచినవారు
కండక్టర్ సరిత & డ్రైవర్ నరసింహులు
📍
డిపో
షాద్‌నగర్ ఆర్టీసీ

మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశంసలు

ఈ విషయం మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి చేరడంతో కండక్టర్ సరిత చూపిన నిజాయితీ, బాధ్యతాయుత వైఖరిని ఆయన ప్రశంసించారు. ఆర్టీసీ సిబ్బంది ప్రజలతో నిత్యం మమేకమై సేవలందిస్తున్నారని, ఇలాంటి ఉద్యోగుల నిజాయితీ సంస్థకు మంచి పేరు తీసుకువస్తుందని మంత్రి పేర్కొన్నారు. షాద్‌నగర్ డిపో అధికారులు సైతం కండక్టర్ సరితను అభినందించారు.