గుజరాత్ మోడల్ vs తెలంగాణ మోడల్.. ముఖ్యమంత్రికి ప్రధాని అదిరిపోయే రిప్లై!

 


PM Modi Telangana Visit: భారత ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన ఆదివారం అత్యంత కోలాహలంగా ప్రారంభమైంది. బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానికి రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, ఇతర బీజేపీ ఎంపీలు ఘనస్వాగతం పలికారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రధానికి అధికారికంగా స్వాగతం పలికారు. అనంతరం ప్ర‌ధాని మోదీ హెచ్ఐసీసీ తెలంగాణ అభివృద్ధిలో మైలురాయిగా నిలిచే సుమారు రూ.9,377 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు ప్ర‌ధాని శంకుస్థాపనలు చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ పర్యటనలో భాగంగా జహీరాబాద్‌లో రూ.2,360 కోట్లతో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టుకు ప్రధాని పునాది వేశారు. అలాగే జాతీయ రహదారి 167 విస్తరణ పనుల్లో భాగంగా రూ.3,175 కోట్లతో గుడిబల్లూర్ నుంచి మహబూబ్ నగర్ వరకు చేపట్టే హైవే పనులకు శంకుస్థాపన చేశారు. వరంగల్‌లో రూ. 1,695 కోట్ల విలువైన పీఎం మిత్ర కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును ప్రధాని వర్చువల్ పద్ధతిలో ప్రారంభించి జాతికి అంకితం చేశారు.

మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా హైదరాబాద్ సమీపంలోని మల్కాపూర్‌లో రూ.611 కోట్లతో నిర్మించిన గ్రీన్ ఫీల్డ్ పిఓఎల్ (POL) కేంద్రాన్ని ప్రధాని ప్రారంభించారు. రూ.1,243 కోట్లతో పూర్తి చేసిన 118 కిలోమీటర్ల కాజీపేట-విజయవాడ మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టును ఆయన ప్రారంభించారు. వీటితో పాటు రూ.292 కోట్లతో 21 కిలోమీటర్ల మేర నిర్మించబోతున్న కాజీపేట రైల్ అండ్ రైల్ బైపాస్ లైన్‌కు శంకుస్థాపన చేశారు.

అనంత‌రం ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఆసక్తికరంగా స్పందించారు. తెలంగాణలోని ప్రతి కుటుంబం కలలు నెరవేర్చడానికి కేంద్ర ప్రభుత్వం మరింత వేగంగా పనిచేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. రాజకీయేతర అంశాల గురించి ముఖ్యమంత్రి ప్రస్తావించిన నేపథ్యంలో.. తాను కూడా రాజకీయాలకు అతీతంగానే మాట్లాడుతున్నానని ప్రధాని స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించిన గుజరాత్ మోడల్ అంశంపై ప్రధాని స్పందిస్తూ.. “గత 10 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం గుజరాత్‌కు ఏవైతే ప్రయోజనాలు కల్పించిందో.. అవన్నీ తెలంగాణకు కూడా అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను.” అని ప్రకటించారు. అయితే అదే సమయంలో.. రాష్ట్రాలు తమ సొంత ప్రణాళికలతో ముందుకు సాగినప్పుడే వేగవంతమైన వృద్ధి సాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యంలో కేంద్రంలో.. రాష్ట్రాల్లో వేర్వేరు పార్టీల ప్రభుత్వాలు ఉండటం సహజమని.. కానీ దేశాభివృద్ధి విషయంలో మాత్రం అందరూ కలిసి నడవాలని పిలుపునిచ్చారు.

రాష్ట్రాల అభివృద్ధి లేకుండా దేశం అభివృద్ధి చెందడం అసాధ్యమని ప్రధాని మోదీ బలంగా నొక్కి చెప్పారు. అందుకే తమ కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ రాష్ట్రాల బలోపేతాన్ని దృష్టిలో ఉంచుకునే రూపొందిస్తామని తెలిపారు. 2047 నాటికి భారత్‌ను వికసిత్ భారత్‌గా మార్చాలన్న లక్ష్యం మన కళ్ల ముందే నెరవేరాలంటే.. కేంద్రం.. రాష్ట్రాలు కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. ఈ దిశగా తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు ఉంటాయని ఆయన భరోసా ఇచ్చారు.

చివరగా.. హైదరాబాద్ అభివృద్ధిలో వస్తున్న మార్పులను ప్రస్తావిస్తూ.. అందరం కలిసికట్టుగా సాగితేనే 2047 నాటికి భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుస్తుందని ఆకాంక్షించారు

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow