జడ్చర్ల మున్సిపాలిటీలో విషాద ఘటన చోటుచేసుకుంది. డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తున్న యువతిపై ఓ యువకుడు కత్తితో దాడి చేసి హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
పోలీసుల వివరాల ప్రకారం.. జడ్చర్ల పట్టణంలోని నిమ్మబావిగడ్డ ప్రాంతానికి చెందిన వైష్ణవి(22) పోలేపల్లి సజీలోని ఎస్వీకేయం పాఠశాలలో ఉద్యోగం చేస్తోంది. ప్రతిరోజులాగే విధులు ముగించుకుని ఇంటికి వస్తుండగా, గత కొంతకాలంగా ఆమెను వేధిస్తున్న హైదరాబాద్కు చెందిన రామచందర్ అనే యువకుడు అడ్డుపడ్డాడు.
ఇంటి సమీపానికి రాగానే ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా, వెంట తెచ్చుకున్న కత్తితో యువతి గొంతు కోసినట్లు సమాచారం. తీవ్ర రక్తస్రావంతో వైష్ణవి అక్కడికక్కడే మృతి చెందింది.
ఈ ఘటనను గమనించిన స్థానికులు పారిపోతున్న నిందితుడిని పట్టుకుని తీవ్రంగా కొట్టారు. దీంతో అతడు కూడా తీవ్ర గాయాలతో ఆస్పత్రికి తరలించబడినట్లు సమాచారం. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.