ట్రావెల్స్ బస్సులు మాత్రమే కాదు.. ఈ మధ్య కాలంలో స్కూల్ బస్సులు కూడా అగ్గికి ఆహుతి అవుతున్నాయి. తాజాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విద్యార్థులతో వెళ్తునన్న ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి బస్సు పూర్తిగా నడిరోడ్డుపై కాలి బూడిదయింది. గమనించిన డ్రైవర్ అప్రమత్తమై పిల్లలను దించేయడంతో పెను ప్రమాదం తప్పింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చల్లగరిగే గ్రామంలోని రైజింగ్ సన్ స్కూల్కు చెందిన AP 36TA 1569 నెంబర్ గల స్కూల్ బస్సులో సాయంత్రం విద్యార్థులను డ్రాప్ చేసేందుకు స్కూల్ నుంచి బయల్దేరింది. మార్గమధ్యలో జూకల్ కెనాల్ సమీపంలోకి చేరుకోగానే బస్సు ఇంజన్లో ఒక్కసారిగా పొగలు రావడం స్టార్ట్ అయ్యాయి. గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమైన బస్సును రోడ్డు మీదే నిలిపివేసి విద్యార్థులను కిందకు దించాడు.
అయితే విద్యార్థులు బస్సులో నుండి దిగుతున్న క్రమంలోనే మంటలు స్టార్ట్ అయ్యాయి. కాసేపట్లో ఆ మంటలన్నీ బస్సు మొత్తం వ్యాపించాయి. బస్సు డ్రైవర్, స్థానికుల సమాచారంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు మంటలను అదుపుచేశారు. అనంతరం బస్సును క్రెయిన్ సహాయంతో రోడ్డుపై నుంచి తొలగించారు. బస్సులో షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు వ్యాపించి ఈ ప్రమాదం జరిగింది పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.