సిద్దిపేట, జనవరి 5: జిల్లాలో ఆత్మహత్యకు పాల్పడిన జూనియర్ డాక్టర్ లావణ్య మృతి చెందారు. ఇంజక్షన్లో గడ్డి మందు వేసుకుని యువ వైద్యురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను వెంటనే నిమ్స్ ఆస్పత్రికి (Nims Hospital) తరలించారు. అయితే చికిత్స పొందుతూ లావణ్య కన్నూమూశారు. ఇంటర్న్షిప్, నీట్ ప్రిపరేషన్ ఒత్తిడే బలవన్మరణానికి కారణమని కాలేజీ సిబ్బంది స్పష్టం చేశారు.
కాగా.. సిద్దిపేట మెడికల్ కాలేజీలో సర్జన్ పూర్తి చేసిన లావణ్య ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఇంటర్న్షిప్ చేస్తున్నారు. లావణ్య జోగులాంబ గద్వాల జిల్లా వాసి. ఇదిలా ఉండగా.. శనివారం నాడు తన హాస్టల్ గదిలోనే లావణ్య ఇంజక్షన్లో గడ్డి మందును తీసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అపస్మారకస్థితిలో ఉన్న లావణ్యను గుర్తించిన తోటి విద్యార్థులు వెంటనే హాస్టల్ సిబ్బందికి తెలియజేశారు. దీంతో వారు హుటాహుటిన లావణ్యను ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
ఆమె పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. కాగా.. చికిత్స పొందుతూ లావణ్య మృతిచెందారు. ఇంటర్న్షిప్, నీట్ ప్రిపరేషన్ ఒత్తిడే లావణ్య ఆత్మహత్యకు కారణమని కాలేజీ సిబ్బంది చెబుతున్నారు. దీనిపై మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. లావణ్య మృతితో కుటుంబసభ్యులు, తోటి విద్యార్థులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు