హైదరాబాద్, జనవరి 07: ప్రియురాలి మరణాన్ని తట్టుకోలేక ప్రియుడు పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్రాహ్మణపల్లె గ్రామంలో చోటుచేసుకుంది. నిన్న(మంగళవారం) రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లిలో పూజ అనే 17 ఏళ్ల యువతి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తమ బిడ్డ ఆత్మహత్యకు కారణం అదే గ్రామానికి చెందిన సిద్దగోని మహేష్ అని మృతురాలి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇవాళ(బుధవారం) మహేష్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా బ్రాహ్మణపల్లె సమీపంలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని.. నిప్పంటించుకుని తీవ్ర గాయాలతో మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో కూడా వీరిద్దరు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నంకు పాల్పడి కోలుకున్నారు. గత కొంతకాలంగా మహేష్, పూజ ప్రేమించుకున్నట్లు సమాచారం. ఇలా ప్రేమ కారణంగా అనేక మంది యువతీ యువకులు క్షణికావేశంలో ప్రాణాలు తీసుకుంటున్నారు. కొందరు హత్య చేస్తుండగా.. మరికొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రేమలో మోసపోయామని కొందరు, పెద్దలు ఒప్పుకోలేదని మరికొందరు ఇలా తమ నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారు.
Tags
Telagana