Sarpanch Elections: తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మొదటి విడత సర్పంచ్ ఎన్నికల ఫలితాలు రాజకీయ పార్టీలకు, ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఊరటనిచ్చాయి. ఈ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించారని వెల్లడించాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ కాంగ్రెస్కే అధిక మద్దతు ఉందని ఈ ఫలితాలు తేటతెల్లం చేశాయి.
మొదటి విడతలో మొత్తం 4,227 సర్పంచ్ స్థానాలకు గాను, కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు ఏకంగా 2,872 స్థానాల్లో విజయం సాధించి అగ్రస్థానంలో నిలిచారు. ఇది మొత్తం ఫలితాల్లో 67.94% కావడం గమనార్హం. ఈ భారీ విజయం అధికార పార్టీకి గ్రామీణ స్థాయిలో ఉన్న పట్టును, ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని చాటింది. జిల్లాల వారీగా చూస్తే, నల్గొండ (231), వికారాబాద్ (189), ఖమ్మం (155), రంగారెడ్డి (103), కామారెడ్డి (100) జిల్లాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు అత్యధిక సంఖ్యలో గెలుపొందారు. నల్గొండ జిల్లాలో మొత్తం 318 స్థానాల్లో 231 స్థానాలను కాంగ్రెస్ దక్కించుకోవడం ముఖ్యంగా చెప్పుకోదగిన విషయం
బీఆర్ఎస్ పోరాటం.. రెండో స్థానంతో సంతృప్తి
తొలి విడత ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) రెండో స్థానానికి పరిమితమైంది. బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు మొత్తం 1,160 సర్పంచ్ స్థానాల్లో విజయం సాధించారు, ఇది మొత్తం ఫలితాల్లో 27.44%. అధికార పీఠం కోల్పోయినప్పటికీ, బీఆర్ఎస్ రాష్ట్రంలో ఇప్పటికీ ప్రధాన ప్రతిపక్షంగా తన స్థానాన్ని నిలబెట్టుకుందని ఈ ఫలితాలు సూచిస్తున్నాయి. ఖమ్మం (37), నల్గొండ (82), మెదక్ (43), కామారెడ్డి (44) జిల్లాల్లో బీఆర్ఎస్ చెప్పుకోదగిన సంఖ్యలో స్థానాలను గెలుచుకుంది
జేపీ ఈ ఎన్నికల్లో మూడో స్థానానికే పరిమితమైంది. బీజేపీ బలపర్చిన అభ్యర్థులు కేవలం 195 స్థానాల్లో (మొత్తం ఫలితాల్లో 4.61%) మాత్రమే గెలుపొందారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ ప్రభావం ఇంకా స్వల్పంగానే ఉందని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. నిజామాబాద్ (16), జగిత్యాల (16), కరీంనగర్ (13), ఆదిలాబాద్ (9) వంటి జిల్లాల్లో బీజేపీ కాస్త మెరుగైన ఫలితాలను సాధించింది. అనేక జిల్లాల్లో బీజేపీ ఖాతా తెరవలేదు లేదా ఒక్క స్థానానికే పరిమితమైంది.
మొదటి విడత సర్పంచ్ ఎన్నికల ఫలితాలు రాష్ట్రంలో గ్రామీణ స్థాయిలో కాంగ్రెస్ పట్టును బలంగా నిరూపించాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి దాదాపు 68% సర్పంచ్ల మద్దతు లభించడం ప్రభుత్వ పనితీరుకు ప్రజల మద్దతుగా పరిగణించవచ్చు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు తమ స్థానాలను మెరుగుపరుచుకోవడానికి రాబోయే విడతల ఎన్నికల్లో మరింత కృషి చేయాల్సి ఉంటుంది.