Andesri Passed Away: ప్రముఖ రచయిత అందెశ్రీ (64) కన్నుమూశారు. లాలాగూడలో ఇంట్లో అకస్మాత్తుగా పడిపోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించారు. అందెశ్రీ జనగాం దగ్గరున్న రేబర్తి అనే గ్రామంలో జన్మించారు. ఆయన అసలు పేరు అందె ఎల్లయ్య. అందెశ్రీ..
అకాల మరణం బాధాకరం
అందెశ్రీ మరణంపై తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో సోమవారం ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ అకాల మరణం బాధాకరమని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అందెశ్రీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని అన్నారు.
హైదరాబాద్: ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ (64) కన్నుమూశారు. ఆయన హైదరాబాద్లోని నివాసంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. అందెశ్రీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
అందెశ్రీ (Ande Sri) అసలు పేరు అందె ఎల్లయ్య. ఆయన 1961 జులై 18న సిద్దిపేట జిల్లా రేబర్తిలోజన్మించారు. గొర్రెల కాపరిగా జీవన ప్రస్థానం ప్రారంభించారు. భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేశారు. పాఠశాల చదువు లేకుండానే కవిగా రాణించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ‘మాయమైపోతున్నడమ్మా’ గీతంతో మంచి పేరు తెచ్చుకున్నారు. కాకతీయ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. అందెశ్రీ రాసిన ‘జయ జయహే తెలంగాణ’ను (ande sri jaya jaya he telangana) రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రగీతంగా గుర్తించిన విషయం తెలిసిందే. ఆయనకు ఇటీవల తెలంగాణ ప్రభుత్వం రూ.కోటి పురస్కారం అందించింది.
ఆశు కవిత్వం చెప్పడంలో అందెశ్రీ దిట్ట. 2006లో గంగ సినిమాకు ఆయనకు నంది పురస్కారం లభించింది. 2014లో అకాడమి ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్ వరించింది. 2015లో దాశరథి సాహితీ పురస్కారం, రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం అందుకున్నారు. 2022లో జానకమ్మ జాతీయ పురస్కారం, 2024లో దాశరథీ కృష్ణమాచార్య సాహితీ పురస్కారం లభించింది. అందెశ్రీ లోక్నాయక్ పురస్కారాన్ని అందుకున్నారు.
తెలంగాణ సాహితీ శిఖరం నేలకూలింది: సీఎం రేవంత్
అందెశ్రీ ఆకస్మిక మృతిపట్ల తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’ రాసిన అందెశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటు అని పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో జయ జయహే తెలంగాణ గేయం కోట్లాది ప్రజల గొంతుకై నిలిచిందన్నారు. అందెశ్రీతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా సీఎం గుర్తుచేసుకున్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర గీతం కొత్త స్వరాలతో రూపకల్పన చేసుకున్నామన్నారు. తెలంగాణ సాహితీ శిఖరం నేలకూలిందంటూ సీఎం సంతాపం వ్యక్తం చేశారు.
అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
అందెశ్రీకి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. ఈమేరకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.