మృత్యు గీతికలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. అగ్నికి ఆహుతవుతున్న వారి హాహాకారాలు చెవిలో మార్మోగుతూనే ఉన్నాయి. ప్రమాదపు ఛాయలు ఇంకా వెరవనేలేదు. మృత్యువు నుంచి బయటపడిన వారు ఇంకా ఆ షాక్ నుంచి కోలుకోనేలేదు. కానీ, అవన్నీ మరిచిపోయి.. కొందరు ప్రవర్తిస్తున్న తీరు, మనుషుల ఆలోచనా విధానంపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది. కర్నూలు జిల్లాలో ఈ నెల 24న జరిగిన రోడ్డు ప్రమాదంలో బస్సు దగ్ధమైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ప్రమాదానికి గురైన బస్సును అధికారులు తాజాగా రోడ్డుకు దూరంగా తీసుకెళ్లారు. దీంతో ప్రయాణికులు ధరించిన ఆభరణాల కోసం బస్సు చుట్టూ కొందరు చేరి వెతుకుతున్నారు. ప్రమాదంలో విలువైన ఆభరణాలు కాలిపోయి ఉంటాయని భావించి.. బూడిదను సంచుల్లోకి ఎత్తి మరీ వెతుకుతున్నారు. కుటుంబ సభ్యులను కోల్పోయి ఎన్నో కుటుంబాలు విషాదంలో ఉంటే.. తమకేమీ పట్టనట్లు బంగారు, వెండి ఆభరణాల కోసం వెతకడం ఏంటని అటుగా వెళ్తున్న ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.