నవాబుపేట : అదనపు కట్నం కోసం భార్యను భర్త వేధించడంతో పోలీసులు కేసు నమోదు చేసిన ఘటన నవాబుపేట పోలీస్ స్టేషన్ పరిదిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. మండల పరిధిలోని కాకర్ల పహాడ్ గ్రామానికి చెందిన గడ్డమీది హనుమంతు తన భార్య దండు మానసను అదనపు కట్నం కోసం శారీరకంగా మానసికంగా వేధింపులకు గురి చేయడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాలుగు సంవత్సరాల క్రితం హనుమంతుకు తమ పెద్దలు రెండు లక్షల రూపాయల నగదు, ఒక బైకును కట్నంగా ఇచ్చి ఆయనతో వివాహం జరిపించారు. తమకు కుమారుడు జన్మించాడని, ఆ తర్వాత గత రెండు సంవత్సరాలుగా తన భర్త 5 లక్షల రూపాయలు అదనంగా కట్నం తెస్తేనే తనతో కాపురం చేయించుకుంటానని పేర్కొంటూ వేధిస్తున్నాడని తెలిపారు. అయితే ఆ డబ్బు తీసుకురాకుంటే తనకు అవసరం లేదని తనను మెడపట్టి ఇంటి నుండి గెంటివేశాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితురాలు మానస ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై విక్రమ్ తెలిపారు.
Tags
mahabubnagar