ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు అత్యవసర భేటీ అయ్యారు. సుప్రీంకోర్టు తీర్పును గౌరవించి పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసుల జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏం చేయాలనే అంశంపై సీఎం చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారుఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసులో భాగంగా బీఆర్ఎస్ నుంచి పార్టీ మారిన పదిమంది ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ నోటీసులు జారీ చేశారు. అయితే.. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు ఎమ్మెల్యేలు తాము బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నామంటూ.. పలు సందర్భాల్లో ప్రకటించారు. శాసనసభ రికార్డుల్లోనూ పది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే.. సుప్రీంకోర్టు నిర్దేశించిన గడువు లోపల పది మంది ఎమ్మెల్యేలపై విచారణ పూర్తి చేసి స్పీకర్ నిర్ణయం ప్రకటిస్తారా..? లేక పెండింగ్లో పెడతారా..? అన్నది చర్చనీయాంశంగా మారింది.
కొన్ని గంటలుగా.. వాడీవేడిగా సాగిన ఈ సమావేశం ముగిసినట్లు సమాచారం.ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితో ఎమ్మెల్యేలు విడివిడిగా భేటీ అయ్యినట్లు తెలుస్తోంది. అయితే.. స్పీకర్ నోటీసులకు ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు వివరణ ఇవ్వగా.. మిగతా వారు కూడా వివరణ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నియోజకవర్గ అభివృద్ధి పనులకు ప్రత్యేక నిధులు కేటాయించాలని ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలో గొడవలు, నేతల మధ్య విభేదాలను సీఎం దృష్టికి తీసుకొచ్చారు. నియోజకవర్గ నేతల మధ్య విభేదాల పరిష్కారం భాధ్యతను పీసీసీ ఛీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు అప్పగిస్తానని సీఎం రేవంత్ హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు..
Tags
Telangana
