ఎర్ర సముద్రంలో (Red Sea) జరిగిన అండర్సీ కేబుల్ కట్ల (Cable Cuts) కారణంగా భారతదేశంతో సహా (India internet outage) ఆసియా, పశ్చిమ ఆసియా దేశాలలో ఇంటర్నెట్ సేవలు అంతరాయం కలిగాయని నిపుణులు చెబుతున్నారు. ఈ ఘటనకు కచ్చితమైన కారణం ఇంకా తెలియలేదు. కానీ, యెమెన్కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు ఈ కేబుల్లను లక్ష్యంగా చేసుకుని దాడి చేసి ఉండవచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. హౌతీలు ఇజ్రాయెల్పై ఒత్తిడి తెచ్చేందుకు ఎర్ర సముద్రంలో దాడులు చేస్తున్నారు. అయినప్పటికీ, గతంలో ఇలాంటి ఘటనలకు తాము బాధ్యులం కాదని హౌతీలు తిరస్కరించారు.
ఇంటర్నెట్ సేవల్లో అంతరాయం
ఇంటర్నెట్ సేవలను పర్యవేక్షించే సంస్థ నెట్బ్లాక్స్ ప్రకారం, ఎర్ర సముద్రంలో జరిగిన కేబుల్ కట్ల వల్ల భారతదేశం, పాకిస్తాన్తో సహా పలు దేశాలలో ఇంటర్నెట్ కనెక్టివిటీ దెబ్బతింది. సౌదీ అరేబియాలోని జెడ్డా సమీపంలో ఎస్ఎండబ్ల్యూ4, ఐఎంఈడబ్ల్యూ కేబుల్ సిస్టమ్లలో సమస్యలు తలెత్తాయని నెట్బ్లాక్స్ తెలిపింది. ఎస్ఎండబ్ల్యూ4 కేబుల్ను భారతదేశానికి చెందిన టాటా కమ్యూనికేషన్స్ నిర్వహిస్తుంది. ఐఎంఈడబ్ల్యూ కేబుల్ను ఆల్కాటెల్-లూసెంట్ నేతృత్వంలోని ఓ కన్సార్టియం చేపడుతుంది. ఈ రెండు సంస్థలు ఈ ఘటనపై ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.
ఈ ప్రాంతాల్లో కూడా..
సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) అధికారులు ఈ అంతరాయంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ యూఏఈ యాజమాన్యంలోని డూ, ఎటిసలాట్ నెట్వర్క్లలో ఇంటర్నెట్ స్లోగా ఉందని ఫిర్యాదు చేశారు. మైక్రోసాఫ్ట్ కూడా తన స్టేటస్ వెబ్సైట్లో పశ్చిమ ఆసియాలో ఇంటర్నెట్ వేగం తగ్గవచ్చని పేర్కొంది. ఎర్ర సముద్రంలోని కేబుల్ కట్ల వల్ల ఈ సమస్య తలెత్తినప్పటికీ, దీనికి లింక్ లేని ప్రాంతాల్లో ఇంటర్నెట్ ట్రాఫిక్పై ఎలాంటి ప్రభావం ఉండదని మైక్రోసాఫ్ట్ వెల్లడించింది.
హౌతీ తిరుగుబాటు నేపథ్యం
ఈ కేబుల్ కట్లు ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై హౌతీ తిరుగుబాటుదారులు ఇజ్రాయెల్పై దాడులు చేస్తున్న సమయంలో జరిగాయని అంటున్నారు. ఈ దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ హౌతీ నాయకులపై వైమానిక దాడులు చేసింది. ఇందులో పలువురు కీలక నేతలు మరణించారు. 2024 ప్రారంభంలో యెమెన్లోని ప్రవాస ప్రభుత్వం హౌతీలు ఎర్ర సముద్రంలో అండర్సీ కేబుల్లపై దాడి చేయాలని ప్లాన్ వేస్తున్నారని ఆరోపించింది. ఆ సమయంలో కొన్ని కేబుల్లు దెబ్బతిన్నప్పటికీ, హౌతీలు ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. ఆదివారం హౌతీల అల్-మసీరా న్యూస్ ఛానల్ ఈ తాజా కేబుల్ కట్లను గుర్తించింది.
ట్ సేవలపై ప్రభావం
ఈ కేబుల్ కట్లు ఆసియా, పశ్చిమ ఆసియా దేశాలలో ఇంటర్నెట్ సేవలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. ఇప్పటికే భారతదేశం, పాకిస్తాన్ వంటి దేశాలలో ఇంటర్నెట్ వినియోగదారులు నెమ్మదిగా కనెక్షన్లను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలు ఎంత త్వరగా పరిష్కారమవుతాయనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఎందుకంటే సంబంధిత సంస్థల నుంచి ఇంకా అధికారిక ప్రకటనలు మాత్రం రాలేదు.